పొన్నియిన్​ సెల్వన్​ షూటింగ్​.. అర్ధరాత్రి 2 గంటలకు మేకప్​.. ఆరింటికి తొలి షాట్​..

-

చాలా సంవత్సరాల తర్వాత దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌’. రెండు భాగాలు వస్తున్న ఈ సినిమా తొలి భాగం సెప్టెంబరు 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ రెండు భాగాల చిత్రీకరణను మణిరత్నం 120రోజుల్లోనే పూర్తి చేశారు. తాజాగా దీనిపై మాట్లాడారు హీరో కార్తి. 120రోజ్లులో ఎలా పూర్తి చేశారో వివరించారు.

“నాగరికతలన్నీ నదుల్లోనే పుట్టాయి. అప్పుడు, అది పొన్ని. ఇప్పుడు కావేరిగా మారింది. ప్రతి నదికి దాని స్వంత లక్షణాలు ఉన్నాయి. నదులు కవులకు స్ఫూర్తినిచ్చాయి. మనలాంటి సామాన్యులకు కూడా అవి స్ఫూర్తిగా నిలిచాయి. చైతన్యపరిచే శక్తిగా ఉన్నాయి. పొన్నియన్ సెల్వన్ చరిత్ర పెద్దదని, దాన్ని సినిమాగా తీయలేమని చాలా మంది చెప్పారు. కానీ మేం ప్రారంభించాం. ఆ తర్వాత కోవిడ్‌ వల్ల కాస్త ఆగింది. ఒక నదికి సముద్రంలోకి వెళ్లే దారి ఎలా తెలుసో, అలానే మణిరత్నంకు కూడా ఈ సినిమాని లాజికల్​గా ఎలా ముగించాలో తెలుసు. ఆయన పూర్తి చేయగలరని మాకు కూడా నమ్మకం ఉంది. ఈ ప్రయాణంలో మేమంతా మణిగారి వెంటే నిలిచాం. ఆయనతో కలిసి పనిచేశాం. ఆయన కేవలం 120 రోజుల్లోనే పొన్నియిన్‌ సెల్వన్‌ రెండు భాగాలను పూర్తి చేశారు. 120 రోజుల్లో రెండు సినిమాలు తీయడం అంత సులభం కాదు. అర్ధరాత్రి 2-2.30 లేచి మేకప్​ వేసుకునేవాళ్లం. మాకు మేకప్ వేయడానికి దాదాపు 30 మంది సిద్ధంగా ఉండేవారు. ఎవ్వరూ నిద్రపోయేవారు కాదు. ఉదయం 6.30 గంటలకు తొలి షాట్​ తీసేవాళ్లం” అని కార్తి వివరించారు.

రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ‘పొన్నియిన్‌ సెల్వన్‌’లో విక్రమ్‌, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌ , కార్తి, త్రిష, జయం రవి, ప్రకాశ్‌ రాజ్‌, ఐశ్వర్య లక్ష్మి, శోభిత ధూళిపాళ్ల, ప్రభు తదితరులు కీలక పాత్ర పోషించారు. ఏఆర్ రెహమాన్‌ స్వరాలు సమకూర్చారు. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సెప్టెంబరు 30న ‘‘పొన్నియిన్‌ సెల్వన్‌’ విడుదల కానుంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్‌, నటీనటుల ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచుతున్నాయి. ఐదు భాషల్లో విక్రమ్‌ స్వయంగా డబ్బింగ్‌ చెప్పటం విశేషం.

చోళుల గురించి స్పెషల్ వీడియో.. మరోవైపు చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవలే చోళ రాజుల గురించి, వారు సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ స్పెషల్‌ వీడియోను పంచుకుంది. చరిత్రకారులు, పరిశోధకులు చోళ రాజుల వైభవం గురించి ఇందులో వివరించారు. చోళుల కాలం తమిళనాడుకు స్వర్ణయుగమని వారు చెప్పారు. క్రీ.పూ.848లో తంజావురు రాజధానిగా విజయాలయ చోళుడు సామ్రాజ్యాన్ని స్థాపించాడని, క్రమంగా రాజరాజచోళుని కాలంలో రాజ్యం మరింత విస్తరించినట్లు తెలిపారు. అంతేకాదు, నాగపట్నం ఓడరేవు ప్రధాన కేంద్రంగా సముద్రయానం ద్వారా వర్తకాన్ని కూడా చేశారని తెలిపారు. తమిళనాడులో ఇప్పుడు ఉన్న ఎన్నో ఆలయాలు చోళులు నిర్మించినవేనని వారు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news