హైదరాబాద్లోని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన షర్మిల.. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి రావాలని ఆయన్ను ఆహ్వానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ…. తన కుమారుడి వివాహానికి పిలిచేందుకే చంద్రబాబు నాయుడు నివాసానికి వచ్చానని ,చంద్రబాబుతో రాజకీయాలు మాట్లాడలేదని షర్మిల తెలిపారు.
క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్కు స్వీట్లు పంపిన విషయంపై ,క్రిస్మస్ విషెస్ చెబుతూ లోకేశ్ చేసిన ట్వీట్ను రాజకీయంగా చూడవద్దని వైఎస్ షర్మిల కోరారు. చంద్రబాబుకు మాత్రమే కాదు హరీశ్రావు, కేటీఆర్,కవిత.. ఇలా చాలామందికి కేక్ పంపించానని ఆమె తెలిపారు. రాజకీయాలు మాత్రమే తమ జీవితం కాదని ఇది ప్రజల కోసం చేస్తున్న సర్వీస్ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. తమకు రాజకీయంగా ఏ లావాదేవీలు ఉండవు.. ఉండకూడదు.. ఉండబోవు కూడా అని తెలిపారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా తన పిల్లల వివాహానికి చంద్రబాబు నాయుడు ను పిలిచారని ఆమె గుర్తు చేశారు. ఇది వింతేమీ కాదని ఆమె అన్నారు.
రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయితేనే మన దేశానికి మంచి జరుగుతుందని.. మత హింసలు తగ్గుతాయని.. అందుకే రాహుల్ను ప్రధానిని చేయాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకున్నారని అన్నారు. అది జరగాలని.. అది జరిగితేనే మంచి జరుగుతుందనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ లో చేరాననీ స్పష్టం చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరైనా టచ్లోకి వచ్చారా? అని మీడియా ప్రశ్నించగా.. తనకు ఇచ్చిన బాధ్యతలపైనే అవన్నీ ఉంటాయని ,వాటికోసం ఎదురుచూడాలని వైఎస్ షర్మిల అన్నారు.