సౌతాఫ్రికా నుంచి గ్వాలియర్ చేరుకున్న మరో 12 చీతాలు

-

దేశంలో అంతరించిపోయిన చీతాల పునరుద్ధరణ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. ఇందులో భాగంగా గదేడాది సెప్టెంబర్‌లో 8 చీతాలు ఆఫ్రికాలోని నమీబియానుంచి మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్కుకు వచ్చాయి. అయితే ఈ నేపథ్యంలోనే.. మధ్యప్రదేశ్ లోని కూనో నేషనల్ పార్క్ లోకి మరో 12 చీతాలు రాబోతున్నాయి. దేశంలో అంతరించి పోయిన చీతాల జాతిని పునరుద్ధరించే ప్రక్రియలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సౌతాఫ్రికా నుంచి ఈ చీతాలను తెప్పించింది. సౌతాఫ్రికా నుంచి చీతాలతో బయలుదేరిన ప్రత్యేక విమానం ఉదయం 10 గంటల ప్రాంతంలో గ్వాలియర్ లో దిగింది. అక్కడి నుంచి అధికారులు వీటిని హెలికాప్టర్లలో కూనో నేషనల్ పార్క్ కు తరలించనున్నారు. ప్రస్తుతం వచ్చిన చీతాలలో ఏడు మగ చీతాలు కాగా, ఐదు ఆడ చీతాలని అధికారులు తెలిపారు.

పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్వారెంటైన్ ఎన్ క్లోజర్లలోకి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని విడుదల చేస్తారు. ఈ ఎన్ క్లోజర్లలో చీతాలను 30 రోజుల పాటు ఉంచి పరిశీలించనున్నట్లు అధికారులు చెప్పారు. అనంతరం వాటిని మరో ప్రత్యేక ఎన్ క్లోజర్ లోకి మార్చుతామని చెప్పారు.

కాగా, గతేడాది సెప్టెంబర్ లో ఎనిమిది చీతాలను నమీబియా నుంచి తెప్పించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 17న వాటిని కూనో నేషనల్ పార్క్ లోని ప్రత్యేక ఎన్ క్లోజర్లలోకి ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేశారు. ప్రస్తుతం ఆ చీతాలను పార్క్ అధికారులు హంటింగ్ ఎన్ క్లోజర్లలో ఉంచారు.

Read more RELATED
Recommended to you

Latest news