విద్యార్థిని కొట్టిన ముగ్గురు టీచర్లు.. దెబ్బలు తట్టుకోలేక మృతి

-

ఉత్తర్ ప్రదేశ్​లోని కన్నౌజ్‌లో అమానవీయ ఘటన జరిగింది. దొంగతనం చేశాడన్న ఆరోపణలతో ఓ విద్యార్థిని ముగ్గురు టీచర్లు ఒకరి తర్వాత ఒకరు విచక్షణారహితంగా కొట్టారు. వారి దెబ్బలు తట్టుకోలేక ఆ విద్యార్థి అక్కడికక్కడే కుప్పకూలాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

ఛిబరమవు కొత్వాలి పరిధిలోని కసవ గ్రామానికి చెందిన జహంగీర్‌కు 15 ఏళ్ల కుమారుడు దిల్షాన్‌ ఉన్నాడు. అతడిని జులై 23న స్థానిక పాఠశాలలో 9వ తరగతిలో చేర్పించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో దిల్షాన్‌ను పిలిచిన ఉపాధ్యాయుడు శివకుమార్‌.. గది తలుపులు మూసేశారు. అనంతరం మరో ఇద్దరు టీచర్లు ప్రభాకర్‌, వివేక్‌ వచ్చి.. తోటి విద్యార్థి వాచీ దొంగతనం చేశావంటూ దిల్షాన్‌ను దారుణంగా కొట్టారు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

విషయం తెలుసుకున్న బంధువులు.. స్థానిక ఆస్పత్రికి తరలించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమించడం వల్ల ఆదివారం కాన్పుర్‌ తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న క్రమంలోనే సోమవారం అర్ధరాత్రి బాలుడు మరణించాడు. తమ కుమారుడు వాచీ దొంగలించాడనే కారణంతో కొట్టారని.. కానీ ఆ వాచీని మరొకరు అతడి బ్యాగులో పెట్టారని తండ్రి ఆరోపించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news