దేశం గ‌ర్వించ‌ద‌గ్గ దార్శినికుడు అంబేద్క‌ర్

-

– విగ్ర‌హావిష్క‌ర‌ణ స‌భ‌లో ఎమ్మెల్యే ధ‌ర్మాన
– ఆయ‌న ఆశ‌య సాధ‌నే ధ్యేయంగా
   ప‌నిచేస్తేనే సిస‌లు నివాళి..
– బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి జ‌గ‌న్ కృషి
– చ‌దువుతోనే వెనుక‌బాటు రూపుమాపేందుకు అవ‌కాశం

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప దార్శినికుడు బాబాసాహేబ్ అంబేద్క‌ర్ అని శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు కొనియాడారు. అదేవిధంగా రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించేవిధంగా ప్ర‌స్తుత పాల‌న ఉంద‌ని, ఆయ‌న ఆశ‌య సాధ‌నే ధ్యేయంగా సీఎం ప‌నిచేస్తున్నార‌ని చెబుతూ..ఉద్దానం ప్రాంతంలో ప‌ర్య‌టించారు. ఆ వివ‌రాలివి..

ఇచ్ఛాపురం : కవిటి మండలం,ఖాజురూ గ్రామంలో డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ విగ్రహాన్ని శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు గురువారం ఆవిష్కరించి, అనంత‌రం ఏర్పాటు చేసిన స‌భ‌లో ఉద్వేగభ‌రితంగా ప్ర‌సంగించారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం సొంత రాజ్యాంగం రూపొందించుకునేందుకు ఏర్పడిన కమిటీకి అంబేద్కర్ సార‌థ్యం వహించారని, దేశం గ‌ర్వించ‌ద‌గ్గ గొప్ప దార్శినికుడు ఆయ‌న అని కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని దేశాల్లో రాజ్యాంగానికి సంబంధించి సగటు జీవిత కాలం 19 ఏళ్లు అని, మరికొన్ని దేశాల్లో ఒక ఏడాది మాత్రమేనని వివ‌రించారు. కానీ భారత దేశంలో 75 ఏళ్లుగా చెక్కు చెదరకుండా నాటుకు పోయింది అని, ఇందుకు కారకుడు అంబేద్కర్ అని తెలిపారు.

ప్రపంచంలో ఉన్న అనేక దేశాల్లో అమ‌లులో ఉన్న వివిధ రాజ్యాంగాల‌ను, సంబంధిత చ‌ట్టాల‌ను అధ్యయ‌నం చేసి మన దేశంలో ఉండే పరిస్థితులకు అనుగుణంగా వాటిని అన్వ‌యించి, ఇక్క‌డ నెల‌కొని ఉన్న కొన్ని హెచ్చు,తగ్గులు స‌వ‌రించే విధంగా, సంస్క‌రించే విధంగా, ఇక్క‌డ జరిగిన అన్యాయాలు రూపు మాపేలా, అప్ప‌టి సామ‌జిక అవసరాలకు తగ్గట్టుగా రాజ్యాంగం రూపకల్పన చేశారని వివ‌రించారు. అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. విగ్రహం ఏర్పాటు కంటే అంబేద్కర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ నెరవేర్చేందుకే ఎక్కువ ప్ర‌య‌త్నం చేయాలని సూచించారు.
అదే ఆయ‌న‌కు ఇచ్చే సిస‌లైన నివాళి అని అన్నారు.

అంబేద్కర్ ని ప్రేమించే వారికి సమాజంలో ఉండే ఆకలి, కన్నీరు తొల‌గించే విధంగా, కులాలు, మతాలు వీటన్నింటి మధ్య సామరస్యాన్ని తీసుకువ‌చ్చే విధంగా సంబంధిత భావజాలం కలిగి ఉండాలని అన్నారు. ఇతర వర్గాలతో ఘర్షణ సరైన మార్గం కాదని, వారికి రాజ్యాంగబద్ధంగా సహకరించాలనే భావనను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని సూచించారు. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన హక్కులు దుర్వినియోగం అవుతున్నాయ‌ని ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి పోక‌డ‌ల‌ను విద్యావంతులు ఎవ్వరూ కూడా అంగీకరించకూడదని, ఆ కారణంగా ఇతరులకు దూరం అవుతారని హెచ్చ‌రించారు.

బలహీన వర్గాలు అభ్యున్నతే లక్ష్యంగా సీఎం జగన్ పాలన సాగిస్తున్నారు, వారి ఆవేదన రూపుమాపేందుకు శ్రమిస్తున్నారని తెలిపారు. అంబేద్కర్ ప్రతిపాదించిన విధంగా చదువు మాత్రమే బలహీన వర్గాలను మార్చగలదని సీఎం జగన్ నమ్ముతున్నారని, అందుకోసం విద్యారంగంపై పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారని వివ‌రించారు. ఇందులో భాగంగానే అత్యున్నత స్థాయి విద్యకు అవసరమైన అన్ని సదుపాయాలూ ప్రభుత్వమే కల్పిస్తోంది అని పేర్కొంటూ, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలి అని కోరారు. తొలుత గ్రామంలో ఇదివ‌ర‌కే నెల‌కొల్పిన వైఎస్ విగ్ర‌హానికి పూల మాలలు వేసి నివాళుల‌ర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version