చంద్రబాబు.. ఇకనైనా మేల్కోండి: మాజీ సీఎం జగన్

-

గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. కాలేజ్ హాస్టల్ వాష్ రూమ్ లో హిడెన్ కెమెరాల ఘటన కలకలం రేపుతోంది. తమ జీవితాలను నాశనం చేశారని.. తమకు న్యాయం చేయాలని విద్యార్థినులు ఆందోళన చేస్తున్నారు. ఓ విద్యార్థి, విద్యార్థినిలు కలిసి కెమెరా అమర్చారని వారు ఆరోపిస్తున్నారు. హిడెన్ కెమెరాలు పెట్టిన విద్యార్థి, అతనికి సహకరించిన విద్యార్థినిపై చర్యలు తీసుకోవాల్సిందేనని విద్యార్థినిలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

ట్విట్టర్ వేదికగా ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ.. ” చంద్రబాబుగారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో విద్యావ్యవస్థలన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రభుత్వ విద్యాసంస్థలపై నిర్లిప్తత, కాలేజీలపై పర్యవేక్షణ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ప్రతిపక్షపార్టీపై బురదజల్లుడు వ్యవహారాలు, రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమల్లో ప్రభుత్వ పెద్దలు, యంత్రాంగం అంతా మునిగిపోయి పాలనను గొలికొదిలేశారు.

నూజివీడు ట్రిపుల్‌ ఐటీ సహా గవర్నమెంటు రెసిడెన్షియల్‌ స్కూళ్లలో కలుషితాహారం కారణంగా వందలమంది విద్యార్థులు అనారోగ్యం పాలవుతున్నా, వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందన అత్యంత దారుణంగా ఉంది. ముఖ్యమంత్రి కొడుకే విద్యాశాఖ మంత్రి కావడంతో అసలు ఏమీ జరగలేదన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పిల్లలకు నాణ్యతతో, రోజూ ఒక మెనూతో పెట్టే మధ్యాహ్న భోజనం, గోరుముద్ద పథకాన్నీ అత్యంత ఘోరమైన కార్యక్రమంగా మార్చేశారు.

మరోవైపు గుడ్లవల్లేరు ప్రయివేటు ఇంజినీరింగ్‌ కళాశాలలో హిడెన్‌ కెమెరాలు పెట్టినట్టుగా వస్తున్న ఆరోపణలు అత్యంత తీవ్రమైనవి. విద్యార్థుల జీవితాలను అతలాకుతలంచేసే ఘటన ఇది. చంద్రబాబుగారూ ఇకనైనా మేలుకోండి. విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడకండి. వారి భవిష్యత్తును పనంగా పెట్టకండి” అని ట్విట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version