ఆరోగ్యశ్రీ పై జగన్ సర్కార్ కొత్త మార్గదర్శకాలు విడుదల.. ఇతర రాష్ట్రాల వారికి కూడా లబ్ధి !

-

ఆరోగ్యశ్రీ పై జగన్ సర్కార్ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. ఏపీలో రోడ్డు ప్రమాదానికి గురైన ఇతర రాష్ట్రాల వ్యక్తులకు డాక్టర్ వైయస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా వైద్యం అందనుంది. రాష్ట్రంలో ఏటా రోడ్డు ప్రమాదాల కారణంగా 8,000 మందికి పైగా మృత్యువాత పడుతున్నారు. ప్రమాదాలు, మరణాలను 15% తగ్గించాలని ఈ ఏడాది ఫిబ్రవరి 14న సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఏపీ రోడ్ సేఫ్టీ కౌన్సిల్ మీటింగ్ లో నిర్ణయించారు.

రాష్ట్రంలో రోడ్డు ప్రమాదానికి గురవుతున్న ఇతర రాష్ట్రాలకు చెందిన డ్రైవర్లు, రోజువారి కూలీలు, ప్రయాణికులకు నగదు రహిత వైద్య సేవలు అందుబాటులోకి తేవాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు చికిత్సలు అందించేలా చూడాలని సూచించారు. ఈ మేరకు రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. దీనితో ఆరోగ్యశ్రీ కింద ఇతర రాష్ట్రాల రోడ్డు ప్రమాద బాధితులకు ఉచిత చికిత్స అందించడానికి వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు సోమవారం మార్గదర్శకాలను జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news