చంద్రబాబు అండ్ కంపెనీ దుష్ప్రచారం జనం నమ్మరంటే నమ్మరు – విజయసాయిరెడ్డి

-

కంపెనీల పేరుతో చంద్రబాబు అండ్‌ కంపెనీ చేసే దుష్ప్రచారం జనం నమ్మరంటే నమ్మరని అన్నారు వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి. ఎన్నికలు దగ్గరపడేకొద్దీ తెలుగుదేశం నేతలు ప్రతి అంశాన్నీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ విషయంలోనైనా పొంతన లేని ‘వాస్తవాలు’ వెలికితీసి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపైనా, పాలకపక్షమైన వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీపైన బురదజల్లుతున్నారని అన్నారు.

“గుంటూరు టీడీపీ ఎంపీ కుటుంబ యాజమాన్యంలోని అమరరాజా బ్యాటరీస్‌ తన విస్తరణ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతాన్ని ఎంపికచేసుకుంటే దానికి కారణం ఏపీ ప్రభుత్వమేనని టీడీపీ నేత నారా చంద్రబాబు నాయుడు, ఆయన అనుకూల పత్రికలు చేస్తున్న అబద్ధాల ప్రచారం నాటి గోబెల్స్‌ ప్రాపగాండాను మించిపోయింది. కార్పొరేట్‌ కంపెనీలు తమ ఫ్యాక్టరీలను ఏ ప్రాంతంలో పెట్టాలనే విషయాన్ని నిర్ణయించడానికి వ్యాపార కారణాలనే మొదట, చివరా పరిగణనలోకి తీసుకుంటాయి.

ఒక్కోసారి ఒక రాష్ట్ర ప్రభుత్వ ఎన్ని రాయితీలు కల్పిస్తున్నా ఆ రాష్ట్రంలో ఒక పరిశ్రమ స్థాపనకు అన్ని వ్యాపార అంశాలూ అనుకూలంగా లేకుంటే ఏ కంపెనీ అయినా ఆ పని చేయదు. చెన్నై, బెంగళూరు, పుణె సమీపంలో ఆటోమొబైల్‌ కంపెనీలు తమ తయారీ యూనిట్లు పెట్టడానికి పూర్తిగా వ్యాపార పరిస్థితులే కారణం. ఈ రెండు నగరాలకు ఉన్న మౌలిక సదుపాయాలే వాటి సమీప ప్రాంతాలకు కోరని వరాలుగా మారాయి. అంతేగాని, తమకు ఇష్టమైన రాజకీయపక్షం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఏ కంపెనీ కూడా తన యూనిట్లను పెట్టదు.

ఈ విషయాలేమీ తెలియవన్నట్టు తెలుగుదేశం నేతలు, వారి అనుకూల మీడియా యజమానులు ఇప్పుడు ఈ బ్యాటరీల కంపెనీ విస్తరణ ప్రాజెక్టు వ్యవహారంలో మాట్లాడుతున్నారు. అసత్యాలతో కూడిన కథనాలు ప్రచారంలో పెడుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి గారి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంపై బురదజల్లడానికి తమ ఎంపీ కంపెనీ ఉత్పత్తి చేసే బ్యాటరీలను చక్కగా వాడుకుంటున్నారు” అని సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు విజయసాయిరెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news