జగన్ – బాబు… ఆ విషయంలో చిత్తశుద్ధి లోపించింది!

-

దళితులు అంటే రాజకీయల్లో ఆటబొమ్మలు.. తోలు బొమ్మలు! ఆట జరుగుతున్నంతసేపూ కీలకమైన ఆటగాళ్లు.. ఆట ముగిసిన అనంతరం ఆటలో అరటిపండ్లు! పార్టీలు మారుతుంటాయి.. ప్రభుత్వాలు మారుతుంటాయి.. ముఖ్యమంత్రులు మారుతుంటారు.. రోజులు మారుతుంటాయి.. జనరేషన్స్ మారుతుంటాయి.. ఐఏఎస్ లు, ఐపీఎస్, మినిస్టర్స్, ఉన్నతంగా రాష్ట్రపతి వంటి స్థానంలో దళితులు ఉన్నప్పటికీ.. వారిపై ఇంకా అనాగరికస్థాయిలో దాడులు, నాయకుల రాజకీయ క్రీడలు జరుగుతూనే ఉన్నాయి!

నాడు అధికారంలో ఉన్నప్పుడు కళ్ళు మూసుకుపోయిన చంద్రబాబు… “దళితులుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు” అని పిచ్చి వాగుడు వాగిన సంగతి తెలిసిందే! ఫలితం 2019 సార్వత్రిక ఎన్నికల్లో కళ్లకు కట్టినట్లు కనిపించింది! ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా… ఆదినారాయణ రెడ్డి వంటి బాబు కేబినేట్ మంత్రులు… దళితులు శుభ్రంగా ఉండరని వాగారు! ఫలితం ఇప్పుడు అజ్ఞాతం!! ఒక దళితుడు రాసిన రాజ్యాంగం మీదే అంతా నడుస్తుందన్న జ్ఞానం మరిచిన కొందరు మూర్ఖులు ఇలా మాట్లాడుతున్నారనే కామెంట్లు బలంగా వింపించాయి!

ప్రభుత్వం మారింది.. మెజారిటీ స్థాయిలో దళితులు జగన్ ను సొంతం చేసుకున్నారు.. అక్కున చేర్చుకున్నారు.. ఈ మధ్యకాలంలో చూడని మెజారిటీని అప్పగించారు!! అయినా దళితుల బ్రతుకు మారలేదా? దాడులు ఆగలేదా? బాబు దళితులపై మానసికంగా దాడి చేస్తే… జగన్ వచ్చాక ఆ దాడి శారీరకంగా మారిందా? జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఇది! ఇదే అదనుగా… తానేదో దళిత పక్షపాతి అన్నట్లుగా… దళిత శంఖారావం కార్యక్రమం ప్రారంభించేశారు చంద్రబాబు! చిత్తశుద్ధి అనేది మాటల్లో కాదు.. చేతల్లో కనిపించాలి, మనసుల్లో ఉండాలి… జగన్ కైనా చంద్రబాబు కైనా…!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Latest news