బిజెపి నోరెత్తకుండా జగన్ అదిరిపోయే ప్లాన్ ?

-

కేంద్ర అధికార పార్టీ అనే ధీమాతో ఏపీలో బీజేపీ తీవ్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై పెత్తనం చేస్తోంది. పదేపదే వైసీపీ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేస్తోంది. మొన్నటి వరకు టిడిపిని టార్గెట్ చేసుకుని ఆ పార్టీ నాయకుల పై అవినీతి ఆరోపణలు చేస్తూ, హడావుడి చేసింది. ఏపీలో తెలుగుదేశం పార్టీ కనుమరుగు అయిపోతే తమకు ఎటువంటి డోకా ఉండదు అనే అభిప్రాయంతో బిజెపి కనిపించింది . అదే సమయంలో వైసీపీ ప్రభుత్వానికి పరోక్షంగా మద్దతు ప్రకటిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాలకు జై కొడుతూ వచ్చింది. కానీ ఇప్పుడు బీజేపీ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా ఎత్తుగడలు వేస్తోంది. దీనికి తగ్గట్టుగానే ఏపీలో వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అంతర్వేదిలో రథం దగ్ధమైన సంఘటన తో పాటు, మరికొన్ని హిందూ దేవాలయాల్లో అపశ్రుతులు చోటు చేసుకోవడం ఇవన్నీ బీజేపీకి బాగా కలిసి వచ్చాయి.
జగన్ క్రిస్టియన్ కాబట్టి హిందూ ఆలయాలపై దాడులను ప్రోత్సహిస్తున్నారు అన్నట్లుగా బీజేపీ అదేపనిగా ప్రభుత్వం పై విమర్శలు చేస్తోంది. ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తోనే తమకు ఇబ్బంది అని భావిస్తూ వచ్చిన జగన్ కు అటు బిజెపి, జనసేన పార్టీలు ఏకు మేకులా మారడం కాస్త ఇబ్బంది కలిగించే పరిణామమే. బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు ఇప్పటికే అంతర్వేది ఘటనపై సిబిఐ విచారణకు జగన్ లేఖ రాశారు. దీంతో బీజేపీ నేతలు నోరెత్తకుండా చేయగలిగామని జగన్ భావించినా, బిజెపి మాత్రం వదిలిపెట్టలేదు. గత టీడీపీ ప్రభుత్వంలోనూ, ఆలయాల కూల్చివేతలు వంటి సంఘటనలు జరిగినా, అప్పట్లో బీజేపీ జనసేన పార్టీ లు అంతగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం రాజకీయ కోణంలో వై సీ పీ ని టార్గెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి.
బిజెపి దూకుడుకు అడ్డుకట్ట వేయకపోతే, హిందూ వ్యతిరేకి అనే ముద్రను తనపై వేస్తారని, ఇది మొదటికే మోసం వస్తుందని జగన్ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు మరుగున పడిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని జగన్ తెరపైకి తీసుకొస్తున్నారు. ఇక పై ప్రత్యేక హోదా అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా పోరాడాలని జగన్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఇప్పటికే పార్టీ ఎంపీలకు దీనిపై కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లోనూ ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించి, బిజెపి ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్రానికి తాము అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ రాజ్యసభలో బిజెపికి అనుకూలంగా ఓటింగ్ లో పాల్గొంటూ పదే పదే కేంద్రానికి మద్దతు ప్రకటిస్తున్నా, బిజెపి ఎందుకు ఇలా చేస్తోందని జగన్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఇప్పుడు ప్రత్యేక హోదా అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి బిజెపి దూకుడుకు ఏపీలో బ్రేకులు వేయాలని, ఈ అంశం ద్వారా బీజేపీ, జనసేన, టిడిపిలకు ఒకేసారి చెక్ పెట్టాలనే విధంగా జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారట.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news