దాగుడుమూతలు ఆడుతూ దేశం దాటిన బాలుడు.. చివరకు..?

-

దాగుడుమూతలు ఆడుతూ ఓ బాలుడు ఏకంగా దేశం దాటిపోయాడు. బంగ్లాదేశ్‌కు చెందిన బాలుడు ఎండీ రతుల్‌ ఇస్లామ్‌ ఫహిమ్‌ ఓ పోర్టు ఏరియాలో నివసిస్తున్నాడు. జనవరి 11న తోటి పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమీపంలోని కంటైనర్‌లో దాక్కున్నాడు. కంటైనర్‌లో సరకు లేకపోవడంతో పోర్టు సిబ్బంది దాన్ని పూర్తిగా తనిఖీ చేయకుండా అలాగే క్రేన్‌ సహాయంతో ఓడలోకి ఎక్కించారు. ఆ ఓడ మెల్లగా రేవును వీడి మలేసియా బయల్దేరి జనవరి 17న మలేసియా చేరింది. కంటైనర్‌లో నుంచి చిన్న చిన్న శబ్దాలు రావడం గుర్తించిన ఓ ఉద్యోగి లోపల ఎవరో ఉన్నారని సహచరులకు చెప్పాడు. తలుపులు తీసి చూడటంతో ఫహిమ్‌ కనపడ్డాడు. అప్పటికే వారం రోజులు కావడంతో సరైన తిండి, నీరు లేక నీరసించి పోయాడు.

ఈ విషయం తెలియడంతో మలేసియాలోని క్లాంగ్‌ జిల్లా అధికారులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు, మెరైన్‌ పోలీసులు పోర్టు దగ్గర వాలిపోయారు. పిల్లవాడు బాగా బలహీనపడటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొలుత ఫహిమ్‌ను మానవ అక్రమ రవాణా ముఠా తీసుకొచ్చిందేమోనని పోలీసులు, అధికారులు అనుమానించారు. కానీ విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించకపోవడంతో మలేసియా ఇంటీరియర్‌ మినిస్టర్‌ సైఫుద్దీన్‌ నసూషన్‌ బాలుడికి సంబంధించిన విషయాలను ట్వీట్‌ చేశారు. బంగ్లాదేశ్‌ హై కమిషనర్‌తో మాట్లాడి చిన్నారిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version