బ్యూటీస్పీక్స్ : మ‌ళ్లీ నీలాంబ‌రి వ‌స్తుంది ? అదే పగ అదే పంతం !

-

మ‌నుషులు ఎలా ఉండాలి.. ఎలా ఉండ‌కూడ‌దు.. ఆడ‌ది ఎలా ఉండాలి.. ఎలా ఉండ‌కూడ‌దు..మ‌గాడు ఎలా న‌డుచుకోవాలి.. ఎలా న‌డ‌వ‌డిక‌ను మార్చుకోవాలి.. ఇంకా ఎన్నో కొన్ని మాట‌ల‌తో కొన్ని స‌న్నివేశాల‌తో పొందికైన, ఒద్దికైన రీతిలో ఓ సినిమా చెప్పింది.
ర‌జ‌నీ జీవితాన్ని మార్చింది. నిర్మాతకు కోట్ల రూపాయ‌లు తెచ్చి పెట్టింది కూడా ! ఏఆర్ రెహ్మాన్ అనే ప్ర‌తిభా శిఖ‌రం అంతెత్తున అక్క‌డ నిలిచి ఈ సినిమాకు ప్రాణ ప్ర‌దంగా నిలిచింది. ఇంకా ఎన్నో! దేవుడు శాసిస్తేనే ర‌జ‌నీ పాటిస్తాడు. మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు దేవుడు శాసించాడు. ర‌జ‌నీ పాటిస్తున్నాడు. అదే ఇప్పుడు ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్.

డార్క్ అండ్ లైట్ లో ఓ క్యారెక్ట‌ర్
ర‌జ‌నీకి దీటుగా చేయాలి
చేస్తున్నంత సేపు పాత్రలో లీన‌మై న‌టించాలి
ఒక‌టి కాదు రెండు కాదు ఎన్నో సార్లు
ఎదురుగా ఉన్న ర‌జనీకి స‌వాళ్లు విస‌రాలి
ఎన్నో షేడ్స్..ఎదురుగా ర‌జ‌నీ
మీరు ఇవన్నీ మ‌రిచిపోండి..మీ కోసం రాసిన
పాత్ర ఇది అని అనుకుని చేయండి అని చెప్పారు ర‌జ‌నీ
క‌ట్ చేస్తే 20 ఏళ్లు దాటిపోయాయి.
ఇప్ప‌టికీ ఆ సినిమా గుర్తుకు వ‌స్తూనే ఉంది.

రజనీ కాంత్,రమ్యకృష్ణ కాంబినేషన్లో వ‌చ్చిన న‌ర‌సింహ సంచ‌ల‌నాల‌కు కేరాఫ్‌గా నిలిచింది. ఆ క్యారెక్ట‌ర్ లో వేరియేష‌న్స్ కార‌ణంగా ర‌మ్యకృష్ణ‌కు అనూహ్య రీతిలో పేరు వ‌చ్చింది. ఇన్నాళ్లు ఆ క్యారెక్ట‌ర్ తీసుకువ‌చ్చిన ఇమేజ్ ను ఆమె ఇంకా నిలుపుకుంటూనే ఉన్నారు. ఆ సినిమా వచ్చి 23 ఏళ్లయినా ఇంకా అదే హవా న‌డుస్తోంది ఆమె వ‌ర‌కూ ! ఇండ‌స్ట్రీలో ఇప్ప‌టికీ అదే గౌర‌వం ఆమెకు ద‌క్కుతోంది కూడా ! కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ క‌థ, క‌థ‌నంతో తెరకెక్కిన సినిమా కావడంతో ప్రేక్షకులు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. అందుకే ఆ సినిమా రజనీ కెరియర్-లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది..మగవాడి తో సమానంగా పొగరు కలిగిన పాత్రలో రమ్యకృష్ణ నటించి ఎంత‌గానో మెప్పించారు. హీరో,లేడీ విలన్‌ మధ్య వ‌చ్చే సన్నివేశాలను ఎంతో హుందాగా, ఆలోచింప‌జేసే విధంగా రాశారు. అంతే స్థాయిలో ప్ర‌గ ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయిన అమ్మాయిగా, ర‌జ‌నీ ప్రేమ పొందేందుకు ప‌రిత‌పించే అమ్మాయిగా ర‌మ్య‌కృష్ణ ఆ పాత్ర‌లో జీవించారు.

హీరోయిన్ గా సౌంద‌ర్య న‌టించినా కూడా  న‌ట‌న ప‌రంగా క్రెడిట్ మొత్తం రమ్యకృష్ణకే దక్కింది. అటుపై ఈ సినిమా సృష్టించిన మానియా అంతా ఇంతా కాదు. అటుపై ర‌జనీ కాంత్, రమ్యకృష్ణ కాంబినేషన్ మళ్ళీ తెరపై కనిపిస్తే బాగుండు అని సినీ అభిమానులు ఎన్నో సార్లు అనుకున్నారు. చాలా రోజుల  పాటు ఆ సినిమా ఇచ్చిన ఇంపాక్ట్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోయారు కూడా ! ఏదైతేనేం పైవాడి ఆశీస్సుల మేర‌కు అభిమానుల కోరిక ఇప్పటికి నెరవెరబోతుంది. వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రానుందనే వార్త  చెన్న‌య్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. రజనీకాంత్‌తో డైరెక్ట‌ర్ నెల్సన్ త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయనున్న విషయం తెలిసిందే. అందులో రమ్యకృష్ణను కీలక పాత్ర కోసం తీసుకుంటున్నారని సమాచారం..

ర‌జ‌నీ న‌టించే 169వ సినిమాను నెల్సన్‌ దిలీప్ విభిన్నం అయిన క‌థ‌తో రూపొందించ‌నున్నారు. సన్‌ పిక్చర్స్‌ నిర్మాణంలో కొన్ని రోజుల క్రితం ఈ సినిమాను అనౌన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన ప‌నుల‌ను డైరెక్ట‌ర్ వేగ‌వంతం చేశారు కూడా. కథను ఓవైపు పూర్తి స్థాయిలో సిద్ధం చేస్తూనే, మరో వైపు ప్రీ  ప్రొడక్షన్ పనులను మొదలు పెట్టారు. ఈ మేరకు సినిమాలోని కీలక పాత్రలో నటించేందుకు రమ్యకృష్ణను సంప్రదించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా ర‌జ‌నీ స‌ర‌స‌న రోబో ఫేం ఐశ్వ‌ర్య రాయ్ న‌టించ‌నున్నారు అని, మరో కీలక పాత్రలో హీరోయిన్‌ ప్రియాంకా అరుళ్‌ మోహన్‌ నటించ‌నున్నార‌ని చెన్న‌య్ ఫిల్మ్ న‌గ‌ర్  వ‌ర్గాలు చెబుతున్న మాట.

Read more RELATED
Recommended to you

Latest news