వైజాగ్ లో ఉన్న ఈ బెల్లం వినాయకుడి గుడి గురించి తెలుసా..?

-

సమ్మక్క-సారలమ్మలకు మొక్కుకుని బంగారం(బెల్లం) సమర్పిస్తాం. కోరిన కోరికలు తీర్చితే అమ్మవార్లకు ఎత్త బంగారం ఇస్తారు. కానీ వినాయకుడికి కూడా బెల్లం మొక్కులు సమర్పిస్తారనే విషయం మీకు తెలుసా..? నిజమండీ..! ఏపీలోని వైజాగ్ లో ఓ అరుదైన వినాయకుడి ఆలయం ఉంది. ఆ ఆలయం పేరు బెల్లం వినాయక దేవాలయం. ఇక్కడ గణపయ్యకు మొక్కుకుంటే కోరికలు తప్పక తీరతాయట. మొక్కులు తీరగానే భక్తులు లంబోదరుడికి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారట.అందుకే ఈ గుడికి బెల్లం వినాయకుడి గుడి అని పేరు వచ్చిందట.

వైజాగ్ లో కేజీహెచ్ పక్క నుంచి వెళ్తే జాలరి పేట వస్తుంది. అక్కడ సముద్రం ఎదురుగా నిర్మించిందే బెల్లం వినాయకుడి గుడి. ఈ ఆలయాన్ని 10-11 శతాబ్దాల మధ్య చోళులు నిర్మించారని చరిత్రకారులు చెబుతుంటారు. ఆలయం చిన్నదైనా.. దీని నిర్మాణంలో చోళుల శిల్పకళ ఛాయలు ఇప్పటికీ కనిపిస్తాయి. నిజానికి ఒకప్పుడు విశాఖ సముద్రతీరంలో ఉండేదని చెప్పే వైశాఖి ఆలయానికి అనుబంధంగా ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే నెమ్మదిగా వైశాఖి ఆలయం సముద్రంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉన్న బెల్లం వినాయకుడి గుడి నిజానికి ఒక శివాలయం. కానీ రానురానూ బెల్లం వినాయకుడి ప్రాధాన్యత పెరిగి ఆ పేరే ఈ గుడికి మిగిలిపోయింది .

ఇక్కడి వినాయకుడి వద్దకు వచ్చి కోరికలు కోరుకునే భక్తులు అవి తీరిన వెంటనే బెల్లం బుట్టలు తెచ్చి స్వామివారికి మొక్కులు చెల్లిస్తారు. ఇక్కడ స్వామికి నైవేద్యమూ, భక్తులకు ప్రసాదమూ .. డూ బెల్లమే. అందుకే ఈ గుడికి వెళ్లే దారిలో ఎక్కడ చూసినా బెల్లం దుకాణాలే కనిపిస్తాయి. ఈ ఆనవాయితీ ఎన్నో తరాల నుంచి వస్తోంది. విశాఖలో అత్యంత ప్రసిద్ధి పొందిన వినాయక దేవాలయాలు రెండు. ఒకటి సిరిపురం లోని సంపత్ వినాయక్ టెంపుల్ అయితే.. రెండోది కొత్త జాలరిపేట లోని బెల్లం వినాయకుని గుడి. ఈ రెండింటి లోనూ బెల్లం వినాయకుడి గుడి చాలా పురాతనమైంది. ఆ మధ్యకాలంలో దీని ప్రశస్తి మరుగునపడినా గత కొన్నేళ్లుగా బెల్లం వినాయకుడికి మళ్లీ ప్రాముఖ్యత పెరిగింది అని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

బెల్లం వినాయకుడి మరో ప్రత్యేకత ఆ విగ్రహ తొండం. సాధారణంగా విఘ్నేశ్వరుడి తొండం ఏ గుడిలో చూసినా ఎడమ వైపునకు ఉంటుంది. కానీ బెల్లం గణపతి తొండం మాత్రం కుడివైపునకు ఉంటుంది. చోళుల సమయంలో ఈ గుడిలో తాంత్రిక పూజలు జరిగేవనీ, అందుకే ఈ విగ్రహ నిర్మాణం విచిత్రంగా ఉంటుంది అని ఇక్కడి పండితులు చెబుతారు. ప్రతిరోజూ ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 11 వరకూ, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకూ ఈ ఆలయం తెరిచి ఉంటుంది. ప్రతి బుధవారం భక్తులతో ఈ గుడి కిటకిటలాడుతూ ఉంటుంది. ఇక గణపతి నవరాత్రులకైతే ఇసుక వేస్తే రాలనంతగా భక్తులు ఈ స్వామిని దర్శించుకుంటారని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీకాంత్ శర్మ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news