మంకీపాక్స్‌పై కేంద్రం అలర్ట్.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..!

-

దేశంలో మంకీపాక్స్‌ కేసులు నానాటికీ పెరుగుతుండటం భయపెడుతోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 8 మంది ఈ వ్యాధి బారినపడగా.. ఓ మరణం కూడా చోటుచేసుకుంది.

దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం మంకీపాక్స్‌పై ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ కూడా ఏర్పాటుచేసింది.ఈ నేపథ్యంలోనే తాజాగా కొన్ని సూచనలు కూడా చేసింది. వ్యాధి వ్యాప్తి నివారణకు ఏం చేయాలో, బాధితులతో ఎలా ఉండాలో.. ఉండకూడదో సూచించింది.

‘‘మంకీపాక్స్‌ బాధితులను తాకినా, వారికి దగ్గరగా ఉన్నా ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి నుంచి మనల్ని మనమే రక్షించుకోవాలి. వ్యాధి బారిన పడకుండా ఉండేందుకు ఏం చేయాలి.. ఏం చేయకూడదో తెలుసుకుందాం’’ అని కేంద్ర ఆరోగ్యశాఖ ట్విటర్‌లో వెల్లడించింది. కేంద్రం జారీ చేసిన సూచనల ప్రకారం..

చేయాల్సినవి..

వ్యాధి సోకిన బాధితులను ఇతరులకు దూరంగా ఐసోలేషన్‌లో ఉంచండి. శరీరంపై దద్దుర్లు పూర్తిగా తగ్గేంతవరకు బాధితులు ఐసోలేషన్‌లో ఉండాలి.

బాధితులు మూడు లేయర్ల మాస్క్‌ ధరించాలి. దద్దుర్లు బయటి గాలికి తగలకుండా చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించాలి.

బాధితులకు సమీపంగా వెళ్లాల్సి వచ్చినప్పుడు మాస్క్‌లు, చేతులకు గ్లౌజులు ధరించాలి.

ఆ తర్వాత చేతులను సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. లేదా శానిటైజర్‌ రాసుకోవాలి.

బాధితులు ఉన్న ఇంటి పరిసరాలు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.

చేయకూడనివి..

మంకీపాక్స్‌ బాధితులు ఉపయోగించే దుస్తులు, టవళ్లు, పడకను కుటుంబంలో ఇతరులు వాడకూడదు.

బాధితులు ఉపయోగించిన దుస్తులను మిగతా వారి దుస్తులతో కలిపి ఉతక్కూడదు. వాటిని ప్రత్యేకంగా శుభ్రం చేయాలి.

మంకీపాక్స్ లక్షణాలు కన్పిస్తే బహిరంగ ప్రదేశాలకు వెళ్లకూడదు.

తప్పుడు సమాచారం నమ్మి బాధితులపై వివక్ష చూపకూడదు.

Read more RELATED
Recommended to you

Latest news