బీజేపీపై కేసీఆర్ టార్గెట్.. నేడో రేపో దిల్లీకి పయనం..!

-

ఎమ్మెల్యేల కొనుగోళ్ల అంశంపై వ్యూహాత్మక మౌనం వహిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశాన్ని.. దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలో చర్చనీయాంశం చేసేందుకు ప్లాన్ వేస్తున్నారు. బీజేపీ కీలక నేతలే ప్రధాన లక్ష్యంగా దిల్లీ వేదికగా విరుచు పడేందుకు సిద్ధమవుతున్నారు. ఇవాళ లేదా రేపు దిల్లీ వెళ్లి అక్కడే మీడియా సమావేశం నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలను టీఆర్ఎస్ నాయకత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోంది. ఓ వైపు బీజేపీ విమర్శల దాడి చేస్తున్నా.. టీఆర్ఎస్ ముఖ్య నేతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దర్యాప్తు ప్రాథమిక స్థాయిలో ఉన్నందున పార్టీ నాయకులెవరూ మాట్లాడొద్దని కేటీఆర్​ ట్వీట్ కూడా చేశారు. స్వయంగా కేసీఆర్​ దిల్లీ వేదికగానే అన్ని విషయాలు బయటపెడతారని టీఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

నలుగురు ఎమ్మెల్యేలు రెండు రోజులుగా ప్రగతిభవన్‌లోనే ఉన్నారు. కేటీఆర్​, హరీశ్​రావుతో కేసీఆర్​ సమాలోచనలు జరుపుతున్నారు. పూర్తి ఆధారాలను సిద్ధం చేసే పనిలో ప్రగతిభవన్ వర్గాలు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మొయినాబాద్ ఫాంహౌస్‌లో గంటల కొద్ది వీడియో రికార్డయినట్లు సమాచారం. అదేవిధంగా దాదాపు పది రోజులుగా ఎమ్మెల్యేల ఫోన్లలో సుమారు ఆరు గంటల ఆడియో రికార్డులు ఉన్నట్లు చెబుతున్నారు.

పోలీసులు అరెస్టు చేసిన నిందితుల ఫోన్లలోనూ కీలక సంభాషణలు పోలీసుల విచారణలో బయటపడినట్లు సమాచారం. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాల్లో నేతల బేరసారాలు, పార్టీలోని కీలక నేతల ప్రమేయం, సీబీఐ, ఈడీ కేసుల ప్రస్తావన వంటివి ఆడియో, వీడియోల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఆడియో, వీడియో రికార్డింగులన్నీ రెండు రోజులుగా కేసీఆర్​ స్వయంగా వింటున్నట్లు సమాచారం. వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా నివేదికలు, ఆడియో, వీడియోలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news