ముసద్దీలాల్స్ జమ్స్ అండ్ జువెల్లర్స్ లో ఈడీ సోదాలు

-

తెలుగు రాష్ట్రాల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్​లో రెండో రోజూ ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 20 గంటలుగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ముసద్దీలాల్.. బ్యాంక్ లావాదేవీలు పరిశీలిస్తున్నారు. షో రూంలోని బంగారం మొత్తాన్ని లెక్కిస్తున్నారు. బంగారానికి సంబంధించిన రికార్డులను ఈడీ అధికారులు పరిశీలిస్తున్నారు.

హైదరాబాద్ ఎర్రమంజిల్‌లోని ముసద్దీలాల్ జెమ్స్ అండ్ జువెల్లర్స్ షోరూంతో పాటు.. హైదరాబాద్‌లోని మిగతా షోరూంలు, విజయవాడ, గుంటూరులోని దుకాణాలల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. ఈడీ అధికారులు బృందాలుగా విడిపోయి హైదరాబాద్, విజయవాడ, గుంటూరుకు చేరుకున్నారు. ఎర్రమంజిల్‌లోని ముసద్దీలాల్ జూవెల్లర్స్‌లో 8 మంది అధికారులు షోరూంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. షోరూంలోకి ఇతరులను ఎవరినీ అనుమతించడం లేదు. ఆరుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ భద్రత మధ్య ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు.

గతంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌పై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. నోట్ల రద్దు సమయంలో నకిలీ బిల్లులు సృష్టించి నగదు చలామణి చేశారన్న ఆరోపణలపై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి.. 130కోట్ల రూపాయల ఆస్తులను గతేడాది ఫిబ్రవరిలో అటాచ్ చేశారు. నోట్ల రద్దు సమయంలో ముసద్దీలాల్ జువెల్లర్స్‌కు చెందిన యాజమాన్యం డబ్బులను వారి ఖాతాలో భారీ ఎత్తున డిపాజిట్ చేశారు. ఈ డబ్బంతా బంగారు విక్రయం ద్వారా వచ్చినట్లు పత్రాలు చూపించారు.

నవంబర్ 8, 2016న పెద్దనోట్లు రద్దు చేస్తున్నట్లు మోదీ రాత్రి 8 గంటలకు ప్రకటించారు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే దాదాపు 6వేల మందికి బంగారం విక్రయించగా 100కోట్ల పైగా నగదు వచ్చినట్లు చూపించారు. ఈ నగదునంతా.. తిరిగి బులియన్ మార్కెట్‌లో బంగారంలో పెట్టుబడి పెట్టి.. ఆ బంగారాన్ని మార్కెట్లో అధిక లాభాలకు విక్రయించినట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం ఈ కేసులోనే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news