ఉక్రెయిన్‌ నుంచి వచ్చేయండి.. భారతీయులకు ఎంబసీ వార్నింగ్

-

ఉక్రెయిన్‌పై మాస్కో దాడులు మరింత ఉద్ధృతమయ్యాయి. రష్యా-క్రిమియాను కలిపే కెర్చ్‌ వంతెన పేలుడు తర్వాత ఈ దాడులు మరింత పెరిగాయి. రాజధాని కీవ్‌ సహా ఉక్రెయిన్‌ వ్యాప్తంగా క్రెమ్లిన్‌ సేనల దాడులు కొనసాగుతుండటం వల్ల పరిస్థితులు మళ్లీ తీవ్రంగా మారాయి.

ఉక్రెయిన్ లో పరిస్థితులు మరింత భయానకంగా మారకముందే భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.  ఉక్రెయిన్‌లో ఇంకా భారతీయులెవరైనా ఉంటే.. వీలైనంత త్వరగా దేశాన్ని విడిచి వెళ్లాలని కీవ్‌లోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. ఈ మేరకు బుధవారం రాత్రి అడ్వైజరీ విడుదల చేసింది.

‘‘ఉక్రెయిన్‌లో క్షీణిస్తున్న భద్రతా పరిస్థితులు, దేశవ్యాప్తంగా పెరుగుతున్న దాడుల దృష్ట్యా భారత పౌరులెవరూ ఇక్కడికి రావొద్దు. భారత పౌరులు, విద్యార్థులెవరైనా ఇంకా ఉక్రెయిన్‌లోనే ఉంటే సాధ్యమైనంత త్వరగా అందుబాటులో ఉన్న మార్గాల ద్వారా దేశాన్ని విడిచి వెళ్లండి’’ అని ఎంబసీ అడ్వైజరీలో సూచించింది.

మరోవైపు.. ఉక్రెయిన్‌లో నాలుగు నగరాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన రష్యా.. బుధవారం అక్కడ మార్షల్‌ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ చట్టానికి భయపడి ఖేర్సన్‌లో కొంతమంది పడవల్లో ఇతర ప్రాంతాలకు పారిపోతున్నారు. ఈ నాలుగు ప్రాంతాలను యుద్ధ కేంద్రాలుగా చేసుకుని రష్యా తమ దాడులను మరింత పెంచే అవకాశముందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో భారత ఎంబసీ తాజా అడ్వైజరీ జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version