జ‌గ‌న్ 2.0 : సీనియ‌ర్ ధ‌ర్మాన వెరీ సిన్సియ‌ర్ ఎందుకంటే ?  

-

కొన్ని వివాదాలు ఆయ‌న ప‌రువు తీశాయి. కొన్ని మంచి ప‌నులు ఆయ‌న పరువు నిలిపాయి. కీర్తి పెంచాయి. జిల్లా  స‌మ‌గ్ర అభివృద్ధి పై త‌న‌కు మంచి న‌మ్మ‌కం ఉంద‌ని త‌రుచూ చెప్పే శ్రీ‌కాకుళం శాస‌న స‌భ్యులు ధ‌ర్మాన ప్ర‌సాద‌రావు మంత్రివ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్న సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు చెబుతున్న రాస్తున్న ప్ర‌త్యేక క‌థ‌నం ఇది.

గ్రామ స‌ర్పంచ్ స్థాయి నుంచి వ‌చ్చారు. పంచాయ‌తీ చ‌ట్టాల‌ను చ‌దివారు. లెజిస్లేటివ్ స్టేట‌స్ ఆయ‌న‌కు తెలుసు. స్టేచ‌ర్ కూడా ఆయ‌న‌కు తెలుసు. స‌భ‌ను న‌డిపే స‌త్తా ఉన్న వారు కూడా ! ముఖ్యంగా స‌భా వ్య‌వ‌హారాల‌పై ప‌ట్టున్న వ్య‌క్తి. ముఖ్యంగా మంచి భాష‌ను ప్రేమిస్తారు. మంచి సాహిత్యం ఎవ‌రు రాసినా ఆనందిస్తారు. చిన్న చిన్న స‌మావేశాల‌కు కూడా ఎటువంటి భేష‌జం లేకుండా హాజ‌రయి, ఆ స‌భ‌కు ఉన్న ప్రాధాన్యాన్ని వివరించి ఆక‌ట్టుకుంటారు. ముఖ్యంగా ఆయ‌న మంచి వ‌క్త. ఇదే సంద‌ర్భంలో చాలా వివాదాలు గ‌తంలో ఆయ‌న‌ను చుట్టుముట్టిన దాఖలాలు ఉన్నాయి. అవి కూడా ప్ర‌స్తావించాలి. ముఖ్యంగా మంత్రిగా ఉన్న‌ప్పుడు క‌న్నెదార కొండ లీజు వ్య‌వ‌హారం ఆయ‌న‌కు పెద్ద గుదిబండ‌లా మారింది. ఆఖ‌రికి జీఓ ర‌ద్దు వ‌ర‌కూ గిరిజ‌నులు పోరాడి అనుకున్న‌ది సాధించారు. ట్విస్ట్ ఏంటంటే క‌న్నెదార‌కు ఎదురుగా ఉన్న స్థ‌లాలు చుట్టూ ఉన్న స్థ‌లాలు మ‌రియు పొలాలు హాయిగా క‌బ్జాల్లోనే ఉన్నాయి. కొండ‌లు త‌వ్వుకుపోతున్నారు కూడా! ఆ రోజు మాట్లాడిన స‌వ‌ర తోట‌ముఖ‌లింగంకు జెడ్పీలో ఎక్స్ అఫీషియో మెంబ‌ర్ గా నియ‌మించారు బాబు.

ఆ త‌రువాత ఓ ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక మిగిలిన విష‌యాలు గురించి రాయ‌లేద‌న్న విమ‌ర్శ ఇవాళ్టికీ టీడీపీ చేస్తూనే ఉంది. అప్ప‌టి మాదిరి ఇప్పుడు క‌థ‌నాలు రావ‌డం లేదు అని గిరిజ‌న సంఘాలు ఆక్రోశిస్తున్నాయి. అదేవిధంగా మంత్రిగా ఉన్న‌ప్పుడే వైఎస్ అక్ర‌మాస్తుల కేసులో ఆయ‌న కూడా నిందితుడు అని తేల్చారు. ఆ కేసుల వాయిదాలు ఇప్ప‌టికీ న‌డుస్తూనే ఉన్నాయి. అవి చీక‌టి రోజులు. వాటి గురించి ఆయ‌న ఇప్ప‌టికీ బాధ‌ప‌డ‌తారు. ఇక చుట్టూ ఉన్న వారు కాస్త ప్ర‌మాద‌క‌ర శ‌క్తులు.. కొంద‌రు రౌడీలు గూండాలు ఆయ‌న పేరు చెప్పుకుని నానా హంగామా చేశారు.

ఇప్పుడు వీళ్లంతా బ‌య‌ట‌కు వ‌స్తే మాత్రం మ‌ళ్లీ ధ‌ర్మాన కు చెడ్డ పేరు రావ‌డం ఖాయం. వారిని ఆ రోజు ఆయ‌న నియంత్రించ‌లేకపోయారు. కొంత అప్ర‌తిష్ట‌కు వారే కార‌ణం అయ్యారు. తాజాగా మంత్రి ప‌ద‌వి వ‌స్తున్నందున ఆయ‌న ముందు చేసిన త‌ప్పిదాలు చేయ‌కుండా హాయిగా జిల్లాకు నాలుగు మంచి ప‌నులు చేసి పేరు తెచ్చుకోవాల‌ని శ్రీ‌కాకుళం జిల్లా వాసుల కోరిక.

Read more RELATED
Recommended to you

Latest news