స్వీడ‌న్ రాయ‌బారితో అంబేద్కర్ సచివాలయంలో మంత్రి కేటీఆర్ భేటీ

-

నేడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో భారత్‌లోని స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ ఆధ్వర్యంలో ఆ దేశ వ్యాపార, వాణిజ్య ప్రతినిధులు, పలు కంపెనీల అధిపతులతో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానాలు, ప్రభుత్వ ఆలోచనా విధానాన్ని వారికి కేటీఆర్ వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాల గురించి చెప్పారు. ముఖ్యంగా టెక్నాలజీ, తయారీ రంగాల్లో స్వీడన్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఈ దిశగా భారత దేశంలో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉన్న కంపెనీలను తెలంగాణకు ఆహ్వానించారు. స్వీడన్ రాయబారి ప్రతినిధి బృందంలో భాగంగా వచ్చిన ఆ దేశానికి చెందిన కంపెనీల ప్రతినిధులు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా పారిశ్రామిక అనుకూల ప్రభుత్వ విధానాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఎనిమిదేండ్ల‌ కాలంలో హైదరాబాద్ నగరం రూపురేఖలు సంపూర్ణంగా మార్చేలా తీసుకువచ్చిన మౌలిక వసతుల కల్పన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Telangana | స్వీడ‌న్ కంపెనీల‌ను ఆహ్వానించిన తెలంగాణ‌.. మంత్రి కేటీఆర్‌తో స్వీడ‌న్ రాయ‌బారి భేటీ

తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఉన్న వ్యాపార అనుకూల వాతావరణంతో మరిన్ని పెట్టుబడులను తెలంగాణకు రప్పించేందుకు ప్రయత్నం చేస్తానని మంత్రి కేటీఆర్‌కు స్వీడన్ రాయబారి జాన్ తెస్లెఫ్ హామీ ఇచ్చారు. భారతదేశంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే కంపెనీల బృందంతో కలిసి పనిచేసేందుకు ఇన్వెస్ట్‌మెంట్‌ ఫెసిలిటేషన్ మెకానిజం పేరుతో తాము ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నామని ఇది స్వీడన్ వ్యాపార వాణిజ్య సంస్థలతో పాటు పలు కంపెనీలతోనూ కలిసి పని చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాల పైన తమ రాయబార కార్యాలయం నిరంతరం పరిశీలన చేస్తుందని స్వీడన్ కంపెనీలకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌కు జాన్ తెస్లెఫ్ తెలిపారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే స్వీడన్ కంపెనీలకు తెలంగాణ అత్యుత్తమ గమ్యస్థానం అని రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news