వర్ష బీభత్సాన్ని ‘జాతీయ విపత్తు’గా ప్రకటించాలి : హిమాచల్‌ సీఎం

-

భారీ వర్షాలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని చిగురుటాకులా వణికిస్తోంది. ఓవైపు భారీ వర్షం.. మరోవైపు వరద బీభత్సం.. ఇంకోవైపు విరిగిపడుతున్న కొండచరియలు.. ఇలా ప్రకృతి విపత్తు ఆ రాష్ట్ర ప్రజలను భయకంపితులను చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ వర్ష బీభత్సాన్ని రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది అక్కడి సర్కార్. ఈ మేరకు హిమాచల్ సీఎం సుఖ్వీందర్ సుఖు ప్రకటన జారీ చేయగా.. అందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

మరోవైపు.. ఈ జల విలయంపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని సీఎం సుఖు కోరారు. దీనిని ‘జాతీయ విపత్తు’గా  ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం నుంచి కురుస్తున్న జోరువానల కారణంగా శిమ్లా సహా పలు జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడి భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నామని.. ప్రజలను అప్రమత్తంగా ఉండాలని చెప్పినట్లు సీఎం తెలిపారు. వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి కావాల్సిన సాయం అందజేస్తున్నామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version