పాకిస్తాన్ రాజకీయం మరో మలుపు తిరిగింది. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు పాక్ జాతీయ అసెంబ్లీ నేడు సమావేశం కానుంది. ఇటీవల స్పీకర్ అవిశ్వాస తీర్మాణాన్ని తోసిపుచ్చడాన్ని పాక్ సుప్రీం కోర్ట్ తప్పుపట్టింది. దీంతో ఈరోజు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అవిశ్వాస తీర్మాణాన్ని ఎదుర్కొనున్నారు. దీంతో పాకిస్తాన్ లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం పడిపోవడం దాదాపుగా ఖాయం అయినట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే పాక్ లో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇండియాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. తాజాగా భారత్ ను ఏ శక్తి నియంత్రించలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రష్యాలో పర్యటించడం అమెరికాకు నచ్చలేదని… తనను అమెరికా తోలుబొమ్మను చేయాలని అమెరికా చూస్తుందని సంచలన ఆరోపణలు చేశారు. పాక్ సంక్షోభం వెనక అమెరికా కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్ట్ తీర్పుకు వ్యతిరేఖంగా దేశవ్యాప్తంగా ఆదివారం నిరసనలకు పిలుపునిచ్చారు. ఇంతకు ముందు కూడా ఇమ్రాన్ భారత్ ను పొడిగారు. ఇండియన్ ఆర్మీ రాజకీయాల్లో కలుగజేసుకోదని ప్రశంసించారు.