వైజాగ్‌ బీచ్‌లో సాయిప్రియ మిస్సింగ్.. గాలింపు కోసం రూ.కోటి ఖర్చు

-

భర్తతో వైజాగ్‌ ఆర్కే బీచ్‌కు వెళ్లి అదృశ్యమైన వివాహిత సాయి ప్రియ నెల్లూరులో ప్రత్యక్షమవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించిన ఓ ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. సాయి ప్రియ గాలింపు కోసం అధికారులు సుమారు రూ.కోటి ఖర్చు చేసినట్లు సమాచారం. ముఖ్యంగా హెలికాప్టర్‌ సాయంతో గాలింపు చేపట్టడంతో ఇంత భారీ స్థాయిలో ఖర్చు చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది.
ఈ విషయంపై విశాఖ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌ మాట్లాడుతూ వివాహిత ఆచూకీ కోసం ప్రభుత్వ శాఖలన్నీ తీవ్రంగా శ్రమించాయని చెప్పారు. ప్రస్తుతం సాయి ప్రియ నెల్లూరులో ఉన్నట్లు సమాచారం వచ్చిందని.. ఆమెను అక్కడి నుంచి విశాఖకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తెలిపారు.
అసలేం జరిగిందంటే.. చిరిగిడి సాయిప్రియ, శ్రీనివాసరావు భార్యాభర్తలు. సాయి ప్రియ విశాఖ ఎన్‌ఏడీ సమీపంలోని సంజీవయ్యనగర్‌లో ఉంటుండగా.. భర్త హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. సోమవారం పెళ్లిరోజు కావడంతో అదే రోజు సాయంత్రం భార్యాభర్తలు ఆర్కే బీచ్‌కు వెళ్లారు. రాత్రి 7.30 గంటల సమయంలో తిరిగి వెళ్లిపోదామని అనుకుంటుండగా.. శ్రీనివాసరావుకు ఫోన్‌ రావడంతో పక్కకు వెళ్లి మాట్లాడి తిరిగి వచ్చేలోపు భార్య కనిపించలేదు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. రంగంలోకి దిగిన పోలీసులు.. మంగళవారం ఉదయం నుంచి స్పీడ్‌బోట్లు, నేవీ హెలికాప్టర్‌ ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి ఆమె ఆచూకీ నెల్లూరులో లభించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news