హస్తం అస్తవ్యస్తం.. నిలవడం కష్టమే..!

-

దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధానంగా అండగా ఉండే రాష్ట్రం ఏదైనా ఉందంటే…అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని చెప్పొచ్చు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఏపీ బాగా సాయం చేసేది. ఇక్కడ నుంచే ఎక్కువ సీట్లు వచ్చేవి. 2004, 2009 ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకుంది. కానీ ఎప్పుడైతే రాష్ట్ర విభజన్ జరిగిందో అప్పటినుంచి ఏపీలో కాంగ్రెస్ ఖతమ్ అయింది. సరే ఏపీలో పోయింది పోనీ తెలంగాణలో బాగుందా? అంటే అది లేదు..గత రెండు ఎన్నికల్లో దారుణంగా ఓడి ప్రతిపక్షానికి పరిమితమైంది.

అయితే అక్కడకి ఊరట కలిగించే అంశం ఏంటంటే..టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే…టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే. ఇది పార్టీకి కాస్త అడ్వాంటేజ్..అలాగే రేవంత్ రెడ్డి పి‌సి‌సి బాధ్యతలు తీసుకున్నాక పార్టీ బలం పెరుగుతూ వస్తుంది. ఇదే క్రమంలో కేసీఆర్ ఊహించని విధంగా రాజకీయ మలుపు తిప్పారు. ప్రధాన ప్రత్యర్ధి అయిన కాంగ్రెస్ పార్టీని కాకుండా బీజేపీని తమ ప్రత్యర్ధిగా పెంచడం మొదలుపెట్టారు.

అటు కేంద్రంలో అధికారంలో ఉండటం..2019 పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటడం..ఆ తర్వాత దుబ్బాక ఉపఎన్నికలో అనూహ్యంగా గెలవడంతో బీజేపీ దూకుడుగా రాజకీయం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఎక్కడా వెనక్కి తిరిగి చూసుకోలేదు..ఇతర పార్టీల నేతలని లాగుతూ, పార్టీని బలోపేతం చేస్తూ..ఈటల రాజేందర్ లాంటి బలమైన నేతని తీసుకుని…హుజూరాబాద్‌లో గెలిచి..టీఆర్ఎస్‌కు ధీటుగా నిలిచింది. జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటింది.

అక్కడ నుంచి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనే విధంగా పోరు తీవ్రంగా సాగుతుంది. అయితే ఎంత పోరు నడిచిన..క్షేత్ర స్థాయిలో బీజేపీ కంటే కాంగ్రెస్ బలం ఎక్కువని, ఇప్పటివరకు బీజేపీకి వచ్చిన విజయాలు బలమైన నేతల వల్ల వచ్చాయి తప్ప..పార్టీ వల్ల రాలేదని అంతా భావించారు. ఇదే క్రమంలో మునుగోడు ఉపఎన్నిక వచ్చింది..ఇది కాంగ్రెస్ సిట్టింగ్ సీటు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళి పోటీ చేసిన ఇక్కడ తాము సత్తా చాటుతామని కాంగ్రెస్ భావించింది. ఇక టీఆర్ఎస్‌కు కాంగ్రెస్ పోటీ ఇస్తుందని అనుకున్నారు.

కానీ మళ్ళీ సీన్ రివర్స్ అయింది..టి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య టఫ్ ఫైట్ నడవగా, ఈ ఫైట్‌లో 10 వేల ఓట్ల మెజారిటీతో టి‌ఆర్‌ఎస్ గెలిచింది. కానీ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. కాంగ్రెస్ 24 వేల ఓట్లు తెచ్చుకుని డిపాజిట్ కోల్పోయింది. తమ సొంత స్థానం, ఎన్నో ఏళ్లుగా బలమైన క్యాడర్ ఉన్న స్థానం..అయినా సరే ఇక్కడ డిపాజిట్ కోల్పోయిందంటే..ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ సత్తా చాటడం కష్టమే అని తేలిపోయింది. రాహుల్ జోడో యాత్ర వల్ల కూడా పార్టీ పైకి లేచే పరిస్తితి కనిపించడం లేదు..పైగా నాయకుల మధ్య విభేదాలు. మొత్తానికి హస్తం పార్టీ పరిస్తితి అస్తవ్యస్తంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news