రాగి ముద్ద , తలకాయ కూర… మన కర్నూల్లో చిరుధాన్యాలతో నోరూరించే హెల్తీ వంటలు

-

మహమ్మారి వచ్చిన తర్వాత.. ప్రజల్లో తినే ఆహారం పై శ్రద్ద పెరిగింది. పాతకాలపు అలవాట్లను మళ్లీ పాటిస్తన్నారు. రాగిముద్ద, జొన్న అన్నం లాంటివి తినడానికి ఇష్టపడుతున్నారు. మిల్లెట్స్ ను డైట్ లో భాగం చేసుకోవాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు. చిరుధాన్యాలతో ఏం చేసినా టేస్టీగా ఉంటాయి.. హెల్తీ కూడా. దీన్ని బిజినెస్ గా చేసుకున్నాడు ఓ వ్యాపారి. కర్నూలులోని బి క్యాంపులో ఏర్పాటు చేసిన ‘లక్ష్మీస్‌ మిల్లెట్‌ ఫుడ్‌ కోర్ట్‌’ ఇప్పుడు అందరిని ఆకక్షిస్తుంది. చిరుధాన్యాలతో చేసే రుచికరమైన అల్పాహారాన్ని జనాలు లొట్టలేసుకుని తింటున్నారు. క్రీడాకారులు, ఉద్యోగులతో ఈ హోటల్‌ ఉదయం పూట కిక్కిరిసిపోతుంది. ఆదివారం అయితే ఇక చెప్పనక్కర్లేదు.

కమ్మగా ..అమ్మ చేతి వంటలా..

జిల్లాకు చెందిన మధుబాబు నాయుడు బీటెక్‌ చదివి వెబ్‌ డిజైనర్‌గా కొంత కాలం ఉద్యోగం కూడా చేశాడు.. ఆ తర్వాత 2019లో ప్రజలకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాన్ని అందించాలన్న ఆలోచనతో చిరుధాన్యాల అల్పాహారం మొదలుపెట్టారు. మధుబాబు తల్లి లక్ష్మమ్మ పాత పద్ధతిలో తాను ఇంట్లో వండి పెట్టినట్లుగానే, హోటల్‌లోనూ తానే వంట మాస్టర్ అయ్యాడు.‌ చిరుధాన్యాలతో చేసిన ఆహారానికి మరింత రుచిని జోడించేందుకు పల్లీ చట్నీ, వెల్లుల్లి, కరివేపాకు పొడులను సొంతగా తయారు చేస్తున్నారు.

నగరంలోని సిల్వర్‌ జూబ్లీ కళాశాల ఎదురుగా, ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడామైదానాన్ని ఆనుకుని ఉన్న ఓ చిన్న హోటల్‌.. కర్నూలు వాళ్లు చూసే ఉంటారు.. చిరుధాన్యాల విశిష్టత, అందులో ఏ చిరుధాన్యం ఆరోగ్యానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరాలు… పీచు, మాంసకృత్తులు, ఖనిజాలు, ఎంతెంత మోతాదులో ఉంటాయో తెలియజేస్తూ ఓ బోర్డు హోటల్‌ ముందు ఉంచారు. ఈ హోటల్‌లో ఉదయం రాగి, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు, సజ్జలు, పెసలు, అండు కొర్రలతో రకరకాల ఇడ్లీలు, దోశలు, ఉప్మా లభిస్తుంది.

అంతేకాకుండా రాగి అంబలి, జొన్న అంబలి తయారు చేసి అమ్ముతున్నారు. నువ్వుల లడ్డు, రాగి లడ్డు, జొన్న, కొర్ర, అరికెలతో చేసిన మురుకులు వంటి చిరుతిళ్లూ ఉంటాయండోయ్..ఆదివారం, మంగళవారం రాగి ముద్ద, జొన్న రొట్టెలతో తలకాయకూర, బోటీ వంటి మాంసాహారం అమ్ముతారు.. రుచి ఉంటుంది.. నెక్ట్స్ లెవల్ అంతే. ఇంకా ఈ హోటల్ ఇవి రుచి చూడని వాళ్లు ఈరోజే వెళ్లి ఓ పట్టు పట్టండి మరీ..!

కర్నూలు వాళ్లు సాధారణంగానే ఆరోగ్యంగా ఉంటారు. తాజా అధ్యయనాలు సైతం.. ఆంధ్రాలో తక్కువ షుగర్, బీపీ ఉన్న జిల్లాలో కర్నూలు లీస్ట్ లో ఉంది. దానికి కారణం.. వీరు ఇప్పటికీ రాగిముద్ద, రొట్టెలను ఆహారంలో భాగం చేసుకోవడమే.!

Read more RELATED
Recommended to you

Latest news