శ్రీవారి గరుడసేవకు వచ్చే భక్తులకు టీటీడీ కీలక సూచనలు

-

శ్రీవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి.  బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధానమైన గరుడసేవను పురస్కరించుకొని టీటీడీ భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది. గరుడ సేవకు వచ్చే భక్తులు తప్పని సరిగా కార్‌ పాసులు తీసుకోవాలని అధికారులు సూచించారు.

ఇవాళ ఉదయం 6 గంటల నుంచి నిర్దేశించిన కార్‌ పాస్‌ సెంటర్ల వద్ద పాస్‌లు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే గరుడసేవకు సంబంధించి విస్తృత ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. దాదాపు 3 లక్షల మందికి శ్రీవారి గరుడ వాహన దర్శనం కల్పించేందుకు ఏర్పాట్లు చేశారు.

 పాసులు ఎక్కడెక్కడ జారీ చేస్తారంటే..

  • కడప జిల్లా వైపు నుంచి వచ్చే భక్తులకు కుక్కలదొడ్డి సమీపంలోని కేశవరెడ్డి హైస్కూల్‌, కరకంబాడి రోడ్డులోని అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కళాశాల వద్ద పాస్‌లు జారీ చేస్తారు.
  • నెల్లూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఏర్పేడు వద్ద ఉన్న శ్రీఇంజినీరింగ్‌ కాలేజీలో పాస్‌లు ఇస్తారు.
  • చెన్నై వైపు నుంచి వచ్చే వాహనాలకు వడమాలపేట టోల్‌ప్లాజా సమీపంలోని ఆగస్త్య ఎన్‌క్లేవ్‌ వద్ద పాస్‌లు జారీ చేస్తారు.
  • చిత్తూరు వైపు నుంచి వచ్చే వాహనాలకు ఐతేపల్లిలోని అగ్రికల్చర్‌ ల్యాండ్స్‌ వద్ద పాస్‌లు ఇస్తారు.
  • మదనపల్లి నుంచి వచ్చే వాహనాలకు శ్రీవిద్యానికేతన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ వద్ద పాస్‌లు జారీ చేయనున్నారు.
  • తిరుపతి టౌన్‌లో ఉన్న భక్తుల వాహనాలకు భారతీయ విద్యాభవన్‌, జూ పార్క్‌ సమీపంలోని దేవలోక్‌, కరకంబాడి రోడ్డులోని ఎస్‌వీ ఇంజినీరింగ్‌ కాలేజీ, అన్నమాచార్య ఇంజినీరింగ్‌ కాలేజిలో పాస్‌లు జారీ చేయనున్నారు.
  • టూరిస్ట్‌ బస్సులకు, తితిదే నిర్ణయించిన పరిమితికి మించి ఎక్కువ సీటింగ్‌ కెపాసిటీ కలిగిన వాహనాలు జూపార్క్‌ సమీపంలో ఉన్న దేవలోక్‌ పార్కింగ్‌ స్థలంలో ఉంచాలి.
  • కార్లు, జీపులు మొదలైన చిన్న వాహనాలు సైన్స్‌ సెంటర్‌కు ఎదురుగా ఉన్న భారతీయ విద్యాభవన్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ చేయాలి.
  • ద్విచక్రవాహనాలు అలిపిరి గరుడ కూడలి వద్ద ఉన్న పాత చెక్‌ పాయింట్‌, ఇస్కాన్‌ టెంపుల్‌ ఎదురుగా ఉన్న గ్రౌండ్‌, మెడికల్‌ కాలేజీ గ్రౌండ్‌, నెహ్రూ మున్సిపల్‌ స్కూల్‌ గ్రౌండ్‌లో పార్కింగ్‌ సదుపాయం కల్పించారు.
  • పార్కింగ్‌ పాస్‌లు పూర్తిగా ఉచితంగా ఇస్తామని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని తితిదే అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news