వాహన బేరర్లకు టీటీడీ కానుక.. ఒక్కొక్కరికి రూ.81,500

-

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. చక్రస్నానం అనంతరం ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలకు ముగింపు పలికారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం కావడంతో టీటీడీ సిబ్బందిని ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అభినందించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడంతో పాటూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేశారని ప్రశంసించారు.

బ్ర‌హ్మోత్స‌వాల్లో విధులు నిర్వ‌హించిన వాహ‌నం బేర‌ర్లు, మేళం సిబ్బంది, వేద‌పారాయ‌ణ‌దారులు, జియ్యంగార్ల శిష్య బృందం, పారిశుద్ధ్య కార్మికులు త‌దిత‌ర 2500 మంది సిబ్బందికి టీటీడీ ఛైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో ధ‌ర్మారెడ్డి వ‌స్త్రాలు బహుమానంగా అందించారు. దిల్లీ స్థానిక స‌ల‌హామండ‌లి అధ్య‌క్షురాలు వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి దంప‌తులు రూ.40 లక్షల వ్యయంతో ఈ వ‌స్త్రాల‌ను అంద‌జేశారు. టీటీడీ ఛైర్మ‌న్‌తోపాటు బోర్డు స‌భ్యులు క‌లిసి రూ.64.50 లక్షలను వాహ‌నం బేర‌ర్ల‌కు కానుకగా అందించారు. ఒక్కో వాహనం బేరర్ కు రూ.81,500/- కానుకగా ఇచ్చారు.

అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీ‌వారి సేవ‌కుల‌ స‌మష్టి కృషితో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిశాయని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. దాదాపు ఏడున్నర లక్షల మంది బ్రహ్మోత్సవాల్లో స్వామి వారిని దర్శించుకున్నట్లు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news