ఈ నెలలో అసెంబ్లీ రద్దు.. త్వరలోనే రాష్ట్రపతి పాలన : ఉత్తమ్‌ కుమార్‌

-

ఈ నెలలో రాష్ట్ర అసెంబ్లీ రద్దు కాబోతుందంటూ నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన వస్తుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ చిత్తుగా ఓడిపోతుందన్నారు. తాను కోదాడ నుంచి 50 వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. మెజారిటీలో ఒక్క ఓటు తగ్గినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన సర్వేలో 25 శాతం ఓటింగ్ లీడ్‭లో ఉన్నామని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రపంచ చరిత్రలో అరుదైన సంఘటన అని ఉత్తమ్ కొనియాడారు. రాహుల్‭తో కలిసి తాను ఏపీ, తెలంగాణలో 450 కిలోమీటర్లు పాదయాత్ర చేశానని చెప్పారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూర్ నగర్ నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి విజయం సాధించారు.

కోదాడ అసెంబ్లీ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2019 ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి బరిలోకి దిగారు. ఈ స్థానం నుండి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య పద్మావతి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగారు. కానీ ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి చేతిలో పద్మావతి ఓడిపోయారు. రానున్న ఎన్నికల్లో మరోసారి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీచేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. తరచుగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news