మహర్షి వెనుక ఆ ముగ్గురి రహస్యం !

-

సాధారణంగా స్టార్ హీరోల సినిమా సెట్టింగ్ విషయంలో తెర వెనుక జరిగే పరిణామాలకు రకరకాల కారణాలు వుంటాయి. కాగా మహేష్ మహర్షి విషయంలో ఇలాంటి ఆసక్తికరమైన కాంబినేషనే తప్పనిసరి పరిస్థితిలో కుదిరింది…సారీ.. సారీ కుదరాల్సి వచ్చింది. జనరల్‌గా హీరోలు, దర్శకుల డేట్స్ కోసం నిర్మాతలు వారికి ముందుగానే కోట్ల రూపాయాల అడ్వాన్స్ చెల్లించి వరుస క్రమంలో వుంటారు.. మేరి నంబర్ కబ్ ఆయేగా అంటూ వారి డేట్స్ కోసం ఎదురుచూస్తుంటారు.ఈ క్రమంలోనే కుదిరింది మహర్షి కాంబినేషన్.

ఊపిరితర్వాత తన తదుపరి చిత్రం దిల్‌రాజుకు చేస్తానని మాటిచ్చాడు దర్శకుడు వంశీ పైడిపల్లి, సీనియర్ నిర్మాత అశ్వనీదత్ దగ్గర ఐదేళ్ల క్రితం అడ్వాన్సు తీసుకున్నాడు మహేష్‌బాబు.. ఎప్పటికప్పుడు తదుపరి సినిమా మీకే అంటున్నాడు దత్‌తో.. ఇక మహేష్‌తో తాను నిర్మాతగా చేసిన బ్రహ్మోత్సవం డిజాస్టర్ కావడంతో తనకు మరో సినిమా చేయాల్సిందేనని పట్టుబట్టాడు పీవీపీ ప్రసాద్. సో.. ఈ ముగ్గురికి విడివిడిగా ఒక్కో సినిమా చేయడం ఇష్టం లేక, ముగ్గురు నిర్మాతలను మహర్షి సినిమాకు కలిపాడు మహేష్.. సో.. ఇది కథ.

కానీ మహర్షి ప్రెస్‌మీట్స్‌ల్లో మాత్రం మహేష్ 25వ సినిమాకు ముగ్గురు అగ్ర నిర్మాతలు కలిశారు. ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమా నిర్మించారు. 25వ సినిమా విషయంలో రాజీ పడకూడదని ముగ్గురి కలిసి ఈ సినిమా చేశాం అంటూ వేదికలపై ఉపన్యాసాలు దంచుతున్నారు.. సో.. అసలు విషయం మాత్రం ఇదన్నమాట..!

మహర్షికి ప్రశంసలు మాత్రమే కావాలా?

సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చినా మహర్షి యూనిట్ మాత్రం ఇంకా సక్సెస్ సెలబ్రేషన్స్ చేస్తూనే వుంది.. సక్సెస్‌కు ఫుల్‌స్టాప్‌లు వుండవు, కామాలు మాత్రమే అని తమ సినిమాలోని సంభాషణ తరహాలోనే సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. మహేష్‌బాబు మాత్రం సక్సెస్ సెలబ్రేషన్స్‌కు ఇంకా ఫుల్‌స్టాప్ పెట్టలేదు. సోషల్‌మీడియాలో కూడా ఆ ఫోటోలతో హల్‌చల్ చేస్తున్నాడు ఈ ప్రిన్స్ బాబు. ఇటీవల జరిగిన సక్సెస్‌మీట్‌లో మహర్షి గురించి.. మహేష్ గురించి వాళ్లకు వాళ్లే స్వీయ ప్రశంసలు కురిపించుకున్నారు. ఎంతగా అంటే యూనివర్శల్ హిట్ టాక్ వచ్చినా సినిమాకు కూడా ఇన్ని ప్రశంసలు లభించావేమో..అనే విధంగా ఆ పొగడ్తలు వున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు సక్సెస్‌మీట్‌లో మీడియా ఇంటరాక్షన్ కూడా నిర్వహిస్తుంటారు. అయితే మహర్షి విషయంలో మాత్రం దిల్ రాజు చాకచక్యంగా వ్యవహరించి మీడియా వేసే ప్రశ్నలతో సక్సెస్ సెలబ్రేషన్స్ మూడ్‌ను అప్‌సెట్ చేసుకోవడం ఇష్టంలేక మీడియా ఇంటరాక్షన్‌ను తప్పించాడు. మహేష్ ప్రసంగం పూర్తవగానే.. యాంకర్ సుమ మీడియా వారు ఏమైనా ప్రశ్నలు వుండే అడగొచ్చు అని ప్రకటించగానే దిల్‌రాజు మాత్రం కార్యక్రమాన్ని ముగిస్తున్నట్లుగా సుమకు సైగ చేసి సక్సెస్ మీట్‌ను ముగించాడు. సినిమాకు డివైడ్‌టాక్‌తో పాటు టిక్కెట్ల రేట్ల విషయంలో మీడియా ప్రశ్నలు అడిగితే.. లేనిపోని సమస్యలు ఎదురవుతాయనే దిల్‌రాజు ఇలా చేయాల్సి వచ్చిందని మీడియా వర్గాలు చర్చించుకుంటున్నాయి..

Read more RELATED
Recommended to you

Latest news