వర్క్ ఫ్రమ్ హోమ్.. జియో బంఫర్ ఆఫర్

-

కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రతి ఒక్కరు ఆందోళన చెందుతున్నారు. కరోనా కట్టడిలో భాగంగా దేశంలోని చాలా రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్, థియేటర్లు, విద్యాసంస్థలు, పబ్‌లు మూతపడ్డాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు ప్రైవేటు సంస్థలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా తమ ఉద్యోగుల్లో కొందరికి ఇంటి వద్ద నుంచే పనిచేసేందుకు అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకునేవారి కోసం టెలికాం సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. తాజాగా ప్రముఖ టెలికాం సంస్థ జియో వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది.

వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ప్లాన్ ధరను జియో రూ. 251 గా నిర్ణయించింది. 51 రోజుల కాలపరిమితితో కూడిన ఈ ప్యాక్‌లో రోజుకు 2 జీబీ డేటాను అందించనుంది. డేటా పూర్తయిన తర్వాత కూడా ఇంటర్నెట్ వాడుకోవచ్చు.. కాకపోతే డేటా స్పీడు మాత్రం 64 కేబీపీస్‌గా ఉంటుంది. అయితే ఈ ప్యాక్‌ను డేటా కోసమే కేటాయించారు. ఇందులో కాల్స్, మెసేజ్‌లు చేయడం కుదరదు. ప్రస్తుతం ఏదైనా జియో ప్లాన్ వినియోగిస్తున్నవారిని ఈ ప్లాన్ వర్తిస్తుందని జియో పేర్కొంది.

ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్.. నెల రోజుల పాటు ఇంట‌ర్నెట్‌ను ఉచితంగా అందిస్తున్న‌ట్లు తెలిపింది. మరోవైపు కరోనా కట్టడి కోసం కేంద్రం కఠిన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జనతా కర్ఫ్యూ కు పిలుపునిచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news