Big News : మహాబూబాబాద్‌ జిల్లాలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌

-

రోజు రోజుకు మన దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తుంది. ప్రతి రోజు కొత్త కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నది. అయితే తాజాగా.. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. గుట్టుచప్పుడు కాకుండా వారిని ఐసోలేషన్‌ గదిలో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆలస్యంగా ఈ విషయం వెలుగులోకి రావడంతో జిల్లా అధికార యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. జిల్లాకు చెందిన రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌, జిల్లా కలెక్టర్‌ శశాంక, వైద్యాధికారులతో ఫోన్‌లో మాట్లాడి విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తున్నామని, విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరు ఆందోళన చెందవద్దని కోరారు. మహబూబాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల (6,7,8,9,10, ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ)లో 378 మంది విద్యార్థులు ఉండగా ఇంటర్‌ విద్యార్థులు పరీక్షలు కాగానే వారి.. వారి స్వగృహాలకు వెళ్లిపోయారు. పదో తరగతి చదువుతున్న 66 మంది విద్యార్థులు రెడ్యాల ఆశ్రమ గురుకుల పాఠశాలలో పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారు. మిగతా 252 మంది విద్యార్థులు గిరిజన సంక్షే మ గురుకుల బాలుర పాఠశాలలో ఉంటున్నారు. కాగా, గత కొద్దిరోజులుగా దగ్గు, జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులతో విద్యా ర్థులు, సెక్యూరిటీ గార్డ్‌ బాధపడుతున్నారని తెలుసుకున్న ఏఎన్‌ఎం వైద్యాధికారులకు సమాచారం ఇచ్చారు.

ఈ నెల 1న కొందరికి కరోనా ఆర్‌టీపీసీ టెస్టులు నిర్వహించగా, ఒక సెక్యూరిటీగార్డు, మరో విద్యార్థికి పాజిటివ్‌ రావడంతో వారిని ఐసోలేషన్‌లో ఉంచి వైద్య సేవలు ప్రారంభించారు. ఆ తర్వాత మరికొంత మంది విద్యార్థులు ఇదే రీతిన అనారోగ్యానికి గురికావడంతో 51 మందికి ఆర్‌టీపీసీ పరీక్షలు చేయించారు. వీరిలో 15 మందికి పాజిటివ్‌ రిపోర్టు 4వ తేదీన వచ్చింది. వీరందరిని గురుకులంలోనే ఓ గది (ఐసోలేషన్‌)లో ఉంచి పౌష్టికాహారం, మందులు ఇవ్వడం ప్రారంభించారు. గురుకుల నిర్వాహకులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి విషయం తెలియజేశారు. దీంతో పలువురి బంధువులు గురుకులానికి చేరుకుని పిల్లలను తీసుకువెళ్తామని కోరడంతో బుధవారం 12 మంది విద్యార్థులకు ఐదురోజులకు సరిపడ మందులు, మాస్కులు ఇచ్చి పంపించారు. మిగిలిన ముగ్గురు గురుకులం ఐసోలేషన్‌లోనే ఉన్నారు. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా ఈనెల 1 నుంచి 6వ తేదీ వరకు 28 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version