సీఎం కేసీఆర్ కి భట్టి విక్రమార్క బహిరంగ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కి లేఖ రాశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బీసీ బందు పథకాన్ని వెంటనే అమలు చేయాలని ఈ లేఖ రాశారు బట్టి. “తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిదిన్నర సంవత్సరాలు కావస్తున్నా బడుగుబలహీనవర్గాల జీవితాల్లో ఎటువంటి మార్పురాలేదని పీపుల్స్‌మార్చ్‌ పాదయాత్రలో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో అనేక గ్రామాల్లో పర్యటించినప్పుడు కళ్లకు కట్టినట్లు కనబడుతోంది. ముఖ్యంగా బడుగు బలహీనవర్గాలు, బహుజనులు ఎదుర్కొంటున్న కష్టాలు వర్ణనాతీతం.

గత ఎనిమిదిన్నర సంవత్సరాల కాలంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీనవర్గాల వారికి చెందాల్సిన సంక్షేమపథకాలు అందడం లేదని తమపట్ల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వివక్షత చూపుతుందని తమ గోడును బలహీనవర్గాల వారు ‘‘పీపుల్స్‌మార్చ్‌’’ పాదయాత్రలో స్వయంగా మమ్మల్ని కలిసి తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. బడుగు బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ తరుపున మీ దృష్టికి తీసుకుని రాదలచాము. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2014 లో రాష్ట్రంలో అధికారం చేపట్టినప్పటి నుండి బీసీ వర్గాలకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఏరు దాటక తెప్ప తగలేసినట్లు 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీసీల అభివృద్ధికి మీరు, టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన వాగ్ధానాలన్నీ తుంగలో తొక్కి బీసీలను నిట్టనిలువునా మోసం చేసిన ఘనత మీకే దక్కుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది.

కులాలవారీ జనగణన చేసి వివరాలు సేకరించారు. దీని ప్రకారం రాష్ట్రంలో బీసీ జనాభా లెక్కలు పర్క్భుత్వం వద్ద ఉన్నా బయటకు ప్రకటించడం లేదు. ఇదంతా జనాభా నిష్పత్తికి అనుగుణంగా నిధులు, నియామకాలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు దక్కకుండా టీఆర్ఎస్ ప్రభిత్వం చేస్తున్న కుట్రలో భాగమే. తెలంగాణ ఏర్పడిన నాటినుంచి బీసీలకు 2.3 శాతం మాత్రమే నిధులు కేటాయిస్తూ చేతులు దులుపుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను 18 సతనికో కుదించారు. 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు రాష్ట్ర కేబినెట్ లో మూడు పదవులు ఇచ్చి దులుపుకున్నారు. ఈ చర్యలతో మీరు బీసీలను అనగదొక్కుతున్నారని అర్థం అవుతోంది. కరోనా కల్లోలంలో చేనేత కార్మికుల బతుకులు కుడెలయ్యాయి.

రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత బీసీ సామాజికవర్గాలు స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాల కోసం లక్షలమంది ధరఖాస్తు చేసినా వారికి ఎటువంటి సబ్సిడీ రుణాలు అందడం లేదు. అధికారిక లెక్కల ప్రకారమే 2014 నుండి 2022 వరకు బీసీ సామాజికవర్గాలు సబ్సిడీ రుణాల కోసం రాష్ట్రప్రభుత్వం 55,183.57 కోట్ల రూపాయల నిధుల కేటాయించగా అందులో 17,231.75 కోట్ల నిధులు మాత్రమే విడుదల చేసింది. అందులో ఖర్చు చేసింది కేవలం 6,078.09 కోట్ల రూపాయలు మాత్రమే. అదే విధంగా ఎంబీసీలకు 2014 నుండి 2022 వరకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ 3.305 కోట్ల రూపాయలు కాగా అందులో మంజూరు చేసిన నిధులు 1,928 కోట్లు. విడుదల చేసిన నిధులు 601.51 కోట్లు మాత్రమే. ఎంబీసీలకు కేటాయించిన నిధులు దాదాపు 511.39 కోట్ల నిధులు మునిగిపోయాయి.

ఇది మీ హయాంలో బీసీలకు, ఎంబీసీలకు జరిగిన సహాయం. ఇప్పటికైనా మీరు కళ్లు తెరిచి బీసీలకు, ఎంబీసీలకు ధరఖాస్తు చేసుకున్న ప్రతీ ఒక్కరికి సబ్సిడీ రుణాలను మంజూరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ తరుపున డిమాండ్‌ చేస్తున్నాం. రాష్ట్ర జనాభాలో 54 శాతం ఉన్న బీసీలకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిధుల కేటాయింపుల్లో, ఖర్చుల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. 2023-24 లో తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్‌ 2 లక్షల 90 వేలకోట్లు కాగా అందులో కేవలం 5 శాతం మాత్రమే బీసీల సంక్షేమానికి నిధులు కేటాయించారు. బీసీల సంక్షేమం పట్ల వారికున్న చిన్నచూపుకు ఇంతకన్నా చక్కటి నిదర్శనం మరొకటి ఉండదు.

రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుండి బీసీల సంక్షేమం కోసం కేటాయించిన నిధులను కూడా పూర్తిగా ఖర్చు చేయడం లేదు. 2018-2019 లో బీసీల సంక్షేమానికి రాష్ట్రప్రభుత్వం 5,960 కోట్లు కేటాయించినా అందులో 63 శాతం నిధులు ఖర్చు చేయలేదు. 2022-23 లో కూడా పరిస్థితి అదే. దళిత బంధు తరహాలో ‘‘బీసీ బంధు’’ పథకం ప్రారంభిస్తామని గతంలో మీరు శాసనసభ వేదికగా హామీ ఇచ్చారు. ఈ హామీ నీటిమీద రాతగానే మిగిలింది తప్ప కార్యరూపం దాల్చలేదు. రాష్ట్రంలో 54 శాతానికి పైగా వున్న బీసీల అభివృద్దికి పథకాన్ని వెంటనే ప్రవేశపెట్టాలని, బీసీలకు సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది” అని లేఖలో పేర్కొన్నారు బట్టి.

Read more RELATED
Recommended to you

Exit mobile version