కాంగ్రెస్‌లో సంక్షోభం ఇంకెన్నాళ్లు

-

కాంగ్రెస్ ఎన్నడూ లేనంత సంక్షోభం ఎదుర్కొంటోంది. పార్టీని ముందుండి నడిపించేవారే కరువయ్యారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. ఎన్నికల ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాహుల్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పూర్తిస్థాయి ప్రెసిడెంట్‌ లేరు. అసలే నాయకత్వలేమి, పైగా అంతర్గత విబేధాలతో పార్టీ పరువు బజారున పడింది. ఇలాంటి సమయంలో… టెన్‌జన్‌పథ్‌తో సంబంధం లేకుండా కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పుంజుకుంటోంది. దీని పైనే ఇప్పుడు కాంగ్రెస్ నేతల్లో అంతర్గతంగా చర్చ నడుస్తుంది.

గతమెంతో ఘనం..వర్తమానం ఆగమాగం అన్నట్లు తయారైందీ కాంగ్రెస్‌ పరిస్థితి. కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ గట్టిగా పోరాడుతున్నా..సెంట్రల్‌లో మాత్రం ఆ ఫైట్ కన్పించడం లేదు. రాష్ట్రాల్లో అన్నీతానై ముందుండి నడిపించాల్సిన అధిష్టానం ఢీలా పడినట్లు కన్పిస్తోంది. ఎన్డీఏపై సరిగా ఫైట్ చేయలేకపోతుందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. పంజాబ్‌లో ఇటీవల ఏడు మున్సిపల్ కార్పోరేషన్‌లకు ఎన్నికలు జరగ్గా…ఏడు క్లీన్‌స్వీప్ చేసింది కాంగ్రెస్‌. కేప్టెన్ అమరీందర్‌సింగ్ నాయకత్వంలోని కాంగ్రెస్..బీజేపీ, అకాళీదల్‌ పార్టీలకు గట్టి షాకిచ్చింది. ఈ విజయానికి కారణం కేప్టెన్‌ అమరీందర్‌సింగ్‌.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించడం..వారికి అమరీందర్‌సింగ్‌ మద్ధతుగా నిలిచారు. అది ప్రజల్లోకి బలంగా వెళ్లింది. అమరీందర్‌సింగ్ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్‌. ఏఐసీసీతో సంబంధం లేకుండా తన స్టాండ్ తీసుకుని వ్యవహరించారు. పుల్వామా ఎటాక్‌ విషయంలోనూ..తనదైన స్టైల్లో స్పందించారు. రాహుల్‌, మిగితా పెద్దలు మోడీని ప్రశ్నిస్తే..అమరీందర్‌సింగ్‌ మాత్రం పాక్‌పై బదులు తీర్చుకోవాలని మోడీని కోరారు. అది అప్పట్లో సంచలనంగా మారింది.

ఇక రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడానికి, కూలిపోకుండా ఉండడానికి అక్కడి నేతల వ్యూహాలే కారణం. వసుంధరా రాజే ప్రభుత్వాన్ని గద్దె దించడంలో అశోక్‌ గెహ్లాట్‌, సచిన్ పైలెట్‌ సక్సెస్‌ అయ్యారు. బీజేపీపై గట్టిగా పోరాటం చేశారు. మధ్యప్రదేశ్ తరహాలో రాజస్థాన్‌లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ ప్లాన్ చేసింది. సచిన్ పైలెట్‌ తిరుగుబాటు చేశారు. ఇక రాజస్థాన్‌ కూడా చేజారుతుందని అంతా భావించారు. అధిష్టానం కూడా దాదాపు చేతులెత్తేసింది. కానీ అశోక్ గెహ్లాట్‌, సచిన్ పైలెట్‌ మధ్య చర్చలు ఫలించడంతో ప్రభుత్వం కూలిపోకుండా ఉండగలిగింది.

ఇక ఛత్తీస్‌గఢ్‌లోనూ అంతే. బీజేపీ కంచుకోటగా ఉన్న ఈ రాష్ట్రంలో.. కాంగ్రెస్‌ మళ్లీ అధికారంలోకి రాగలిగింది. రమణ్‌సింగ్‌ లాంటి బలమైన నేతను గద్దె దింపగలిగింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ సీఎం, సీనియర్ లీడర్‌ అజిత్‌ జోగి పార్టీని వీడి కొత్త పార్టీని స్థాపించారు. కాంగ్రెస్ హైకమాండ్‌పై విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం కష్టమేనని ఎగ్జిట్‌ పోల్స్ కూడా ప్రకటించాయి. కానీ అనూహ్యంగా పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రస్తుత సీఎం భూపేష్‌ భగేల్‌..ఒంటిచేత్తో పార్టీని ముందుండి నడిపించారు. బీజేపీ ఓడించి చత్తీస్‌గఢ్‌లో పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చారు.

పుదుచ్చేరిలాంటి చిన్న రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ నేతలు గట్టిగా పోరాడారు. లెఫ్టినెంట్ గవర్నర్‌ కిరణ్‌బేడి, నారాయణస్వామి మధ్య ఫైట్‌ ఓ రేంజ్‌లో నడిచింది. లెఫ్టినెంట్ గవర్నర్ తీరును నిరసిస్తూ..వీధిపోరాటాలు కూడా చేశారు. తన ప్రభుత్వాన్ని కూలిపోకుండా జాగ్రత్తపడుతూనే.. గవర్నర్‌పైనా పోరాడారు. అసలే చిన్న రాష్ట్రం. ప్రతిపక్షం కూడా స్ట్రాంగ్‌గా ఉంది. నలుగైదుగురు ఎమ్మెల్యేలను లాగితే.. ప్రభుత్వమే కూలిపోయే ప్రమాదం. అంత తక్కువ మెజార్టీతో దాదాపు ఐదేళ్లు నడిపించారు. ఇటీవల నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో నారాయణస్వామి ప్రభుత్వం మైనార్టీలో పడింది.

కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో రోజు రోజుకు బలపడుతుంటే..సెంటర్‌లో మాత్రం ఢీలాపడుతూ వస్తోంది. పేరుకు పెద్ద పెద్ద లీడర్లు ఉన్నా..గట్టిగా ఫైట్ చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అదే కాంగ్రెస్‌కు శాపంగా మారింది. కేంద్ర విధానాలపై హైకమాండ్‌ గట్టిగా ఫైట్ చేసిందీ లేదు. పంజాబ్ లాంటి రాష్ట్రంలో..పార్టీ బలపడిందంటే అది కూడా కేప్టెన్ అమరీందర్‌సింగ్ లాంటి నేతల వల్లే. రాష్ట్రాలను నడింపించే కేంద్ర కమిటీ ఇప్పటికీ తాత్కాలిక అధ్యక్షులే ఉన్నారు. రాహుల్ రాజీనామా తర్వాత పూర్థిస్థాయి ప్రెసిడెంట్ లేరు. జూన్‌, జులై వరకూ సోనియానే కొనసాగే అవకాశం ఉంది. ఈ సంక్షోభం నుంచి కాంగ్రెస్ ఎలా బయటపడుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news