ఎడిట్ నోట్: తెలంగాణ ‘క్యాస్ట్’ పాలిటిక్స్.!

-

క్యాస్ట్ పాలిటిక్స్..ఇప్పుడు ఏ రాష్ట్రంలో చూసిన ఈ రాజకీయం సర్వ సాధారణమైంది..దేశ స్థాయిలోనే ఈ కుల రాజకీయం నడుస్తుంది. ఇక ఈ కుల రాజకీయానికి ఏపీ పెట్టింది పేరు…అక్కడ జరిగినట్లు మరెక్కడ కూడా కుల రాజకీయం జరగదు. అయితే ఒకప్పుడు తెలంగాణలో ఈ కుల రాజకీయం ఉండేది కాదు.. కులాల వారీగా రాజకీయం చేయడం.. ఆ ఓట్లు కొల్లగొట్టడం అనేది తక్కువ. కానీ ఇప్పుడు రాజకీయం మారిపోయింది.

అక్కడ కుల రాజకీయం వచ్చేసింది. ఇక ఇప్పుడు అక్కడ అధికారంలోకి రావడానికి ప్రధాన పార్టీలు కుల రాజకీయం చేస్తున్నాయి. మొదట అధికార బి‌ఆర్‌ఎస్..రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు ఆకట్టుకోవడానికి..ఒక్కో కులానికి ఒక్కో కార్యక్రమం తీసుకొస్తున్నారు. ఇప్పటికే దళితులకు..దళితబంధు తెచ్చారు. ఇప్పుడు బీసీ కులవృత్తుల వారికి రూ లక్ష సాయం అంటున్నారు. అటు మైనార్టీలకు కూడా లక్ష సాయం చేస్తున్నారు. ఇలా కులాల వారీగా సంక్షేమ పథకాలు పెట్టి..వారి ఓట్లని ఆకట్టుకోవడానికి కే‌సి‌ఆర్ ఇలా స్కెచ్ వేశారు.

ఇక బి‌ఆర్‌ఎస్ పార్టీకి ధీటుగా కాంగ్రెస్ సైతం అదే పంథాలో ముందుకెళుతున్నారు. ఎన్నికల్లో బి‌సి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓట్ల లక్ష్యంగా రాజకీయం చేస్తున్నారు. అలాగే డిక్లరేషన్లు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారికి ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతున్నారు. తాజాగా బి‌సి డిక్లరేషన్ పై నేతలు భేటీ అయ్యారు. త్వరలోనే బి‌సి గర్జన సభ ఏర్పాటు చేయనున్నారు. అలాగే బి‌సిలకు ప్రతి పార్లమెంట్ పరిధిలో 2 అసెంబ్లీ సీట్లు కేటాయించనున్నారు. అంటే 17 పార్లమెంట్ స్థానాల్లో 34 అసెంబ్లీ సీట్లు ఇవ్వనున్నారు.

బి‌సి గర్జన సభకు రాహుల్ గాంధీ, కర్నాటక సి‌ఎం సిద్ధరామయ్యని ఆహ్వానించాలని చూస్తున్నారు. ఈ నెల 30న కొల్లాపూర్ సభలో ప్రియాంక గాంధీ పాల్గొంటారు. ఆమె చేత మహిళా డిక్లరేషన్ ప్రకటిస్తారు.  ఆగస్టు 15న కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గర్జన సభ నిర్వహించనున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరగనున్న సభలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు కాంగ్రెస్‌ ఏం చేయనున్నది వివరిస్తూ డిక్లరేషన్‌ ప్రకటించనున్నారు.  అటు హిందూ మతం ఎజెండాగా ముందుకెళుతున్న బి‌జే‌పి..క్రిస్టియన్, ముస్లిం ఓటర్లని సైతం ఆకట్టుకునేలా పనిచేయనుంది. మరి చివరికి ఎవరికి ఎక్కువ మద్ధతు వస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news