77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆసక్తిరేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు

-

తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రుల కోటాలో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా ప్రస్థుతం రెండు స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో 119 నియోజకవర్గాలకు గాను 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో 65 శాతం నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికల పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.

ఎన్నికలు జరిగే నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానం హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానాల్లో ఓటర్ల సంఖ్య సుమారు 11 లక్షలుండగా కొత్త జిల్లాల పరంగా చూస్తే 21 జిల్లాల్లో ఎన్నికల మూడ్ కనిపిస్తుంది. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ జిల్లాల పరిధిలో 77కి గాను 64 మంది అధికారపార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ,ఖమ్మం స్థానం నుంచి 29 మంది ఎమ్మెల్యేలుండగా హైదరాబాద్ రంగారెడ్డి నుంచి 35 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. పార్టీ కేడర్ చెదిరిపోకూడదు అన్న ఉద్దేశ్యంతో ప్రధాన పార్టీలన్ని ఎన్నికల బరిలో దిగాయి.

హైదరాబాద్-రంగారెడ్డి స్థానంలో మిత్రపక్షం ఎంఐఎం నుంచి కూడా ఏడుగురు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో 5.60 లక్షల మంది ఓటర్లు నమోదవ్వగా సుమారు 25 శాతం మంది టీఆర్ఎస్ కి చెందిన మద్దతుదారులు ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తుంది. ఈ స్థానం నుంచి ఆఖరి నిమిషంలో పీవీ కుమర్తె వాణిని అభ్యర్దిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ స్థానం కంటే నల్గోండ-ఖమ్మం-వరంగల్ స్థానం పైనే అధికారపార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రతి 50 మంది ఓటర్లుకు ఒక ఇంచార్జ్ చొప్పున బాధ్యతలు అప్పగించి ఎన్నికల ప్రణాళిక సిద్దం చేసింది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి బరిలో దిగారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం రచిస్తోంది. నల్లగొండ–ఖమ్మం–వరంగల్, రంగారెడ్డి–హైదరాబాద్‌–మహబూబ్‌నగర్‌ జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు సగం నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రులు ఓటు వేయనుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితం రాబట్టుకోవాలనే కోణంలో టీపీసీసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ రెండింటిలో ఒక్క స్థానాన్నయినా కచ్చితంగా గెలవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవలంబిస్తోన్న నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసి ఓట్లను రాబట్టుకోవాలని చూస్తుంది. పార్టీ అభ్యర్ధులు రాములు నాయక్‌, చిన్నారెడ్డి లు ఇప్పటికే ప్రచార పనుల్లో నిమగ్నమయ్యారు.

ఇక దుబ్బక,గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీకూడా రెండు సీట్ల పై గట్టిగానే ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ సీటు గతంలోను విజయం సాధించడంతో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచందర్ రావుని బరిలో దించింది. ఇక ఖమ్మం-వరంగల్ స్థానం నుంచి ప్రేమేందర్ రెడ్డిని అభ్యర్ధిగా ప్రకటించినా సిట్టింగ్ సీటు అయిన హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటు పైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ పీవీ కుమార్తెను బరిలో దించడంతో ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టింది. 77 నియోజకవర్గాల్లో ఫలితాలు ఈ ఎన్నిక ద్వారా ప్రతిభింబిస్తుండటంతో కమళం దళం కూడా ఎన్నికల ప్రచార సరళి పై వ్యూహాలు రూపొందిస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news