భూకంప శిథిలా కింద.. 12 రోజుల తరువాత మృత్యుంజయుడు

-

తుర్కియేను అతలాకుతలం చేసిన భూకంపం గత 100 ఏళ్ల కాలంలో కనీవినీ ఎరగనిదిగా పరిశీలకులు భావిస్తున్నారు. ఈ ప్రకృతి విపత్తులో 35 వేల మందికి పైగా దుర్మరణం పాలయ్యారని, 1,05,505 మంది గాయపడ్డారని ఆ దేశ అధ్యక్షుడు రిసెప్‌ తయ్యిప్‌ ఎర్డొగాన్‌ చేసిన ప్రకటన తీవ్రతను వెల్లడిస్తోంది. టర్కీ (తుర్కియా), సిరియాలను భూకంపం అతలాకుతలం చేసి 12 రోజులు గడిచిపోయాయి.. పేకమేడల్లా కూలిపోయిన భవనాల కింద ఇప్పటికీ కొంతమంది చిక్కుకుపోయారు. బయటపడే దారిలేక, తిండి, నీరు లేక నిస్సహాయ స్థితిలో ప్రాణాలు వదిలేస్తున్నారు. టర్కీలోని హతాయ్ ప్రావిన్స్ లో మాత్రం రెస్క్యూ బృందాలు ఓ వ్యక్తిని శుక్రవారం సజీవంగా బయటకు తీశాయి. పన్నెండు రోజుల పాటు తిండి, నీరు లేకుండా, గడ్డకట్టించే చలిలో సాయం కోసం ఎదురుచూసిన వ్యక్తిని ఎట్టకేలకు కాపాడారు. దాదాపు 278 గంటల పాటు శిథిలాల కిందే ఉండిపోయిన ఆ వ్యక్తిని హుటాహుటిన ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.

థర్మల్ జాకెట్ లో చుట్టి, స్ట్రెచర్ పై పడుకోబెట్టి రెస్క్యూ సిబ్బంది అతడిని బయటకు తీసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇన్ని రోజుల పాటు శిథిలాల కింద ప్రాణాలతో ఉండడం మిరాకిల్ అని అధికారులు చెబుతున్నారు. గురువారం కూడా ఓ పద్నాలుగేళ్ల యువకుడిని కాపాడినట్లు చెప్పారు.

హతాయ్ రీజియన్ లోని 200 ప్రాంతాల్లో రెస్క్యూ పనులు ఇంకా కొనసాగుతున్నాయని టర్కీ ఉపాధ్యక్షుడు ఫౌత్ ఒక్టే శుక్రవారం
వెల్లడించారు. రాత్రీపగలు అన్న తేడా లేకుండా శిథిలాల తొలగింపు చేపడుతున్నట్లు వివరించారు. కాగా, భూకంపం కారణంగా టర్కీ, సిరియాలలో మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటిందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news