ఏపీలో కీలక మంత్రి సడన్ గా ఎందుకు సైలెంట్ అయ్యారు ?

-

ఏపీ ప్రభుత్వంలో యాక్టివ్ గా ఉండే ఓ మంత్రి సడన్ గా సైలెంటయ్యారు,
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సైతం తన మాటల తూటలతో టీడీపీని ఏకిపారేసిన ఆమత్యులు ఇప్పుడు మాటలు పొదుపుగా వినియోగిస్తూ అజ్ఞాతంలోకి వెళ్ళారు. కీలకశాఖకి ప్రాతినిధ్యం వహిస్తున్నా ప్రభుత్వంలో తన పనేదో తాను చేసుకుంటూ హడావిడి తగ్గించారు. పార్టీ వ్యవహారాలైనా.. ప్రభుత్వ కార్యక్రమాలైనా మంత్రిగారు మచ్చుక కూడా కనబడటం లేదు..ఇదే అంశం పై ఇప్పుడు వైసీపీ పార్టీ,ప్రభుత్వ వర్గాల్లో చర్చకి దారి తీసింది.

ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చాక మంచి హడావిడే చేశారు. కానీ క్రమంగా కనుమరుగయ్యారు.మీడియాకు ఆమడ దూరంలో ఉంటున్నారు. ఇతర మంత్రులతో పోలిస్తే బుగ్గన సెక్రటేరియట్‌కు రావడం తక్కువే. తన మంత్రిత్వశాఖకు సంబంధించిన సమీక్షలు ఎక్కువగా ఇంటి వద్దనే చేస్తున్నారట. ఆ కారణంగా అధికారులు కూడా ఎక్కువగా అమాత్యులవారి ఇంటికే వెళ్తున్నారట. సీఎంస్థాయిలో ఏదైనా సమావేశాలు ఉంటేనే.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కనిపిస్తున్నారు బుగ్గన.

పోలవరం ప్రాజెక్టు లేదా కేంద్రం నుంచి రావలసిన నిధుల విషయంలోనే ఢిల్లీ వెళ్లినపుడు మీడియా ముందుకు వస్తున్నారు మంత్రి బుగ్గన. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, పార్టీ వ్యవహారాలు, టీడీపీపై విమర్శల విషయాల్లో వీలైనంత వరకు మీడియాకు దూరంగా ఉంటున్నారనే చర్చ జరుగుతోంది. సొంత జిల్లా కర్నూలు పర్యటనలోను అధికారులతో సమీక్షలు చేసినా ఇతర మంత్రులు బ్రీఫ్ చేసిన సందర్భాలే ఎక్కువ. జిల్లాలో పార్టీకి సంబంధించి కూడా అంతంత మాత్రమే జోక్యం చేసుకుంటున్నారట. సొంత జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలతో కూడా అంతంత మాత్రంగానే మెలుగుతున్నారట.

బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరుకు.. ఇప్పటికి చాలా తేడా ఉందంటున్నారు పార్టీ నేతలు. విపక్షంలో ఉన్నపుడు అసెంబ్లీలోను, బయట టీడీపీపై ఒంటికాలితో లేచే బుగ్గన ఇప్పుడు ఆ స్థాయిలో విమర్శలు చేయడం లేదని చర్చ జరుగుతోంది. అసెంబ్లీలో పిట్ట కథలు చెబుతూ టీడీపీని ఇరుకున పెట్టడంలో బుగ్గన ముందుండేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మౌనంగా తన పని తాను చేసుకుపోతున్నారట. అయితే మంత్రిలో వచ్చిన మార్పు పై మాత్రం అటు పార్టీ,ఇటు ప్రభుత్వ వర్గాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news