కమలంతో కళ్యాణ్ కటీఫ్?

-

బీజేపీ పొత్తు నుంచి పవన్ బయటకొచ్చేస్తారని…టీడీపీతో కలిసి పనిచేస్తారని ఎప్పటినుంచో ఏపీ రాజకీయాల్లో ప్రచారం జరుగుతుంది. అసలు పేరుకు పొత్తులో ఉన్నాయి గాని…ఎప్పుడు జనసేన-బీజేపీలు కలిసి పనిచేయలేదనే సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న ఈ రెండు పార్టీలు ఎప్పుడు కూడా కలిసి పోరాటాలు చేయలేదు…నిరసనలు చేయలేదు. ఎవరికి వారే సెపరేట్ గా కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నారు. కాకపోతే తాము ఎప్పుడు మిత్రపక్షాలమని చెప్పుకుంటూ ఉంటాయి.

కానీ మిత్రపక్షాల మాదిరిగా మాత్రం పనిచేయవు. అయితే రాను రాను రెండు పార్టీల మధ్య దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఇప్పటికే రెండు పార్టీల మధ్య సీఎం అభ్యర్ధి విషయంలో కాస్త గ్యాప్ పెరిగిందని చెప్పొచ్చు. బీజేపీ-జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్ధిగా పవన్ ని ప్రకటించాలని జనసేన శ్రేణులు కోరుతున్నాయి. అలాగే రూట్ మ్యాప్ ఇవ్వాలని పవన్ ఎప్పుడో కోరారు.  బీజేపీ మాత్రం ఇంతవరకు పవన్ కు రూట్ మ్యాప్ ఇవ్వలేదు..అలాగే తమ పార్టీలోనే సీఎం అభ్యర్ధులు ఉన్నారని చెప్పి బీజేపీ సైడ్ అయింది.

ఇక తాజాగా మోదీ పర్యటన తర్వాత రెండు పార్టీల మధ్య గ్యాప్ ఇంకా ఎక్కువైంది. అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమంలో బీజేపీ…జనసేనకు చోటు ఇవ్వలేదు. అలాగే పవన్ ని సైతం ఆహ్వానించలేదని ప్రచారం జరిగింది. అయితే ఆ సభలో జగన్ తో బీజేపీ క్లోజ్ గా ఉంది. అక్కడ నుంచి బీజేపీ, పవన్ మధ్య దూరం పెరిగింది. పైకి పవన్ తమ మిత్రుడు అని బీజేపీ నేతలు చెబుతున్నారు గాని…వాస్తవ పరిస్తితులని చూస్తుంటే అలా కనిపించడం లేదు.

అందుకే పవన్ సైతం అధికారికంగా బీజేపీతో విడిపోయెందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఎలాగో బీజేపీ వల్ల రాజకీయంగా ఒరిగేది ఏమి లేదు…ఏదో కేంద్రం సపోర్ట్ తప్ప…ఏపీలో బీజేపీకి బలం లేదు..పైగా బీజేపీ అంటే ఏపీ ప్రజలు ఆగ్రహంతోనే ఉన్నారు…కాబట్టి బీజేపీకి దూరం జరగాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది…త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. చూడాలి మరి కమలానికి పవన్ గుడ్ బై చెబుతారో లేదో.

Read more RELATED
Recommended to you

Latest news