బీజేపీ తో కన్ఫ్యూజన్: సంజయ్ అలా…సోము ఇలా…

-

రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఎప్పుడు అధికార పార్టీనే టార్గెట్ చేసుకుని రాజకీయం చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు అధికార పార్టీని టార్గెట్ చేసి వారి బలాన్ని తగ్గించి, ప్రతిపక్షాలు బలం పుంజుకోవాలని చూస్తాయి. అయితే ఈ విషయంలో బీజేపీ వైఖరి కాస్త భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధ్యక్షుల రాజకీయం పూర్తిగా విరుద్ధంగా నడుస్తుంది.

బీజేపీ

మొదట నుంచి తెలంగాణలో బలపడాలని ప్రయత్నిస్తున్న బీజేపీకి ఇప్పుడు మంచి అవకాశాలు వస్తున్నాయి. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలిచిన దగ్గర నుంచి తెలంగాణలో కమలదళం దూకుడుగా ఉంటుంది. బండి సంజయ్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న దగ్గరనుంచి అధికారంలో ఉన్న కేసీఆర్ టార్గెట్‌గానే రాజకీయాలు చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో కేసీఆర్‌ని గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు.

అయితే తెలంగాణలో బీజేపీ చేసే ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఇప్పటికే దుబ్బాక ఉపఎన్నికలో సత్తా చాటింది. అటు జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో టీఆర్ఎస్‌ని ఓడించినంత పనిచేశారు. నాగార్జున సాగర్‌లో ఓడినా, ఈటల రాజేందర్‌ని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్‌లో సత్తా చాటుతామని చెబుతున్నారు. తెలంగాణలో బండి సంజయ్ మాత్రం అధికార టీఆర్ఎస్‌ని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేసి, చాలావరకు సక్సెస్ అయ్యారు.

కానీ సంజయ్‌కు పూర్తి విరుద్ధంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పనిచేస్తున్నారు. 2019 ఎన్నికల్లో నోటా కంటే ఓట్లు తక్కువ తెచ్చుకున్న సరే కేంద్రంలో అధికారంలోకి రావడంతో దూకుడు ప్రదర్శించారు. నెక్స్ట్ ఎన్నికల్లో తామే జగన్‌కు ప్రత్యామ్నాయమని హడావిడి చేశారు. కానీ రెండేళ్లలో చూస్తే ఏపీలో బీజేపీ ఏ మాత్రం పుంజుకోలేదు. జనసేనతో పొత్తు పెట్టుకున్న సరే ఒక్కశాతం కూడా ఓట్లు పెంచుకోలేదు.

పైగా సోము, జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి పెద్దగా విమర్శలు చేసిన సందర్భాలు లేవు. ఈయన ఎంతసేపు చంద్రబాబుపైనే ఫైర్ అయ్యారు గానీ, జగన్‌పై ఎప్పుడు ఫైర్ అవ్వలేదు. పోనీ టీడీపీని వీక్ చేసి బీజేపీని ఏమన్నా బలోపేతం చేశారా? అంటే అది చేయలేదు. మొత్తానికి చూస్తే తెలంగాణలో సంజయ్ సత్తా చాటుతుంటే…ఏపీలో సోము బీజేపీని సెట్ చేయలేకపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news