హస్తినకు ఈటల-కోమటిరెడ్డి..స్ట్రాటజీ మార్చేస్తున్నారా?

-

తెలంగాణలో బీజేపీ ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చేసుకుంటుంది..కే‌సి‌ఆర్‌కు ధీటుగా ముందుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తుంది. నెక్స్ట్ ఎన్నికల్లో టి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకెళుతుంది. మునుగోడు ఉపఎన్నికలో ఓటమి పాలైన..గట్టిగా పోరాడిందనే పాజిటివ్ బి‌జే‌పికి ఉంది. అసలు ఏ మాత్రం బలం లేని చోట 85 వేల పైనే ఓట్లు తెచ్చుకుంది. దీంతో బి‌జే‌పికి ఇంకా ఊపు వచ్చింది.

ఇక ఇక్కడ నుంచి ఏ మాత్రం వెన్నక్కి తగ్గకుండా పనిచేయాలని కేంద్రం పెద్దలు, రాష్ట్ర బీజేపీ నేతలకు సూచిస్తున్నారు. ఇప్పటికే రామగుండం వచ్చి ప్రధాని మోదీ..కే‌సి‌ఆర్ సర్కార్‌ని గట్టిగా టార్గెట్ చేశారు. అలాగే బి‌జే‌పి నేతలకు భవిష్యత్ లో ఎలా పోరాడాలనే అంశంపై దిశానిర్దేశం చేశారు. అటు ఓటమి పాలైన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా బి‌జే‌పి మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇదే సమయంలో తాజాగా ఈటల రాజేందర్, కోమటిరెడ్డిలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.

వారు హస్తినకు బయలుదేరారు..అక్కడ అమిత్ షా వారిద్దరు భేటీ అవ్వనున్నారు.  రాష్ట్రంలో మోదీ సభ తర్వాత సడన్ గా ఈ ఇద్దరికీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఇద్దరు నేతలు కే‌సి‌ఆర్ టార్గెట్ గానే దూకుడుగా రాజకీయం చేస్తున్నారు. పైగా ఒకరు టి‌ఆర్‌ఎస్ నుంచి, మరొకరు కాంగ్రెస్‌లో బడా నేతలుగా ఎదిగి బీజేపీలోకి వచ్చినవారే.

అంటే వారి ద్వారా టి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల నుంచి బి‌జే‌పిలోకి వలసలు పెంచాలనే దిశగా అమిత్ షా గైడెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే బి‌జే‌పి కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి ఉంటాయి. వాటికి ఈ ఇద్దరినీ ఉపయోగించుకుని, స్థానికంగా ఉండే శ్రేణులకు గైడెన్స్ ఇప్పించే అవకాశం కూడా ఉంది. మొత్తానికి ఈటల, కోమటిరెడ్డి ఢిల్లీకి వెళ్ళడం అనేది చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news