దేవలోకానికి దారి చూపే గుహ.. ఎన్నో ప్రశ్నలకు అదే సమాధానం..!

-

శివుని ఆజ్ఞ లేనిదే చీమైన కుట్టదంటారు..అలాంటి శివయ్య కొలువై ఉండేది…స్మశానాల్లో.. మనిషి తన జీవితాన్ని ముగించుకుని చేరే బొందిలో శివయ్య ఉంటాడు. ఇప్పుడు చెప్పుకోబోయే ఓ గుహ గురించి మీరు వింటే..ఎంతో ఆశ్యర్యంగా ఒకింత భయంగా కూడా అనిపిస్తుంది. జమ్మూలోని శివఖోరి గుహాలయం. స్వర్గలోకానికి దారంటూ ఉంటుందా..? ఆ దారంట వెళితే బొందితో స్వర్గానికి చేరతాతా..? దేవలోకానికి దారి చూపే గుహాలయం ఎక్కడ ఉంటుంది..? ఆ మార్గం ద్వారా వెళ్లినవాళ్లు ఎందుకు తిరిగి రాలేదు..? వాళ్లంతా నిజంగానే స్వర్గానికి వెళ్లారా? లేక మధ్యలోనే మృత్యువు ఒడిలో చిక్కుకున్నారా ? ఎన్నో ప్రయాసాలకోర్చి భక్త జనం ఎందుకు ఆ గుహకు వెళతారు..? పరమశివుడు అక్కడ ఎందుకు కొలువై ఉన్నాడు? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఈ గుహ..మనం కూడా తెలుసుకుందామా.!

శివఖోరి. కశ్మీరిలో ఖోరి అంటే గుహ. శివుడు నివాసం ఉంటున్న గుహ కాబట్టే దీనికి శివఖోడి అన్న పేరు. జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో రణసు అన్న గ్రామంలో ఓ అద్భుత గుహాలయంలో మహాశివుడు కొలువై ఉన్నాడు. కాలినడకన నాలుగు కిలోమీటర్లు వెళితే కానీ ఈ గుహ ప్రాంతానికి చేరుకోలేము. జమ్ము నుంచి గుహాలయానికి చేరుకోవడానికి రెండు మార్గాలున్నాయి. వైష్ణోదేవి గుడికి ట్రెక్‌ మొదలయ్యే కట్రా టౌన్‌ మీదుగా వెళ్లవచ్చు.. అఖనూర్‌ మీదుగా రాజోరి వెళ్లేదారిలో ఖండామోర్హా జంక్షన్‌ నుంచి కూడా రణసు గ్రామానికి చేరుకోవచ్చు.

కట్ర నుంచి రణసుకు వెళ్లాలంటే 70 కిలోమీటర్లు ఘాట్‌రోడ్డులోనే ప్రయాణించాలి.. అసలు ఈ ప్రయాణమే ఆహ్లాదకరంగా ఉంటుంది. రణసు పట్టణం కూడా కాదు. చిన్న గ్రామం. ఇక్కడ నుంచి గుహ వరకు నాలుగు కిలోమీటర్ల నడక దారి ఉంటుంది. నడవలేని వాళ్లు గుర్రాల మీద వెళ్లవచ్చు. డోలీలు కూడా దొరుకుతాయి. ఈ పుణ్యక్షేత్రానికి నిత్యం వందలాది మంది భక్తులు వస్తుంటారట. గుహలోని అంతర్భాగం విశాలంగా ఉంటుంది. ఒకేసారి 300 మంది భక్తులు ప్రార్థనలు చేసుకునే వీలుంటుంది. అక్కడ నుంచి లోపలికి పాక్కుంటూ వెళ్ళవలసి వుంటుంది . కొన్ని చోట్లయితే పొట్ట నెలకు ఆనించి పాకాల్సి వస్తుంది. అలా ఎంతో కష్టపడి వెళితే వెడల్పాటి గుహ వస్తుంది.

అక్కడంతా అద్భుతమే.!

ఇంత కష్టపడి అక్కడి వెళ్లినవారికి ఆ అద్బుతాన్ని చూడగానే కష్టమంత ఎగిరిపోతుంది. జగన్మాత పార్వతీదేవి. వినాయకుడు. నారదుడు. పరమశివుడి ఝటాఝూటం. పద్మం ఇలా ప్రకృతిసిద్ధంగా ఏర్పడిన దేవిదేవతా మూర్తులు కనిపిస్తారు. చేతికందేంత ఎత్తులో బహు పడగల ఆదిశేషుడిని దర్శించుకోవచ్చు. అక్కడ్నుంచి కొంతదూరం లోపలికి వెళితే. రెండు మార్గాలు వస్తాయి.. అక్కడ ఉండే సెక్యూరిటీ వాళ్లు యాత్రీకులను రెండో దారిలోంచి పంపుతారు.. మొదటిదారి నిషిద్ధం. 200 మీటర్ల పొడవు.. మూడు మీటర్ల ఎత్తు. ఒక మీటర్‌ వెడల్పు ఉన్న ఈ గుహలో ఊపిరి తీసుకోవడం కూడా కష్టమే.

శ్వాసకోశ వ్యాధిగ్రస్తులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంత కష్టపడి ఎందుకు వెళ్లడం అని అనుకోవచ్చు. వెళ్లకపోతే శివ దర్శనం ఎలా అవుతుంది.? లోపలికి వెళితే నాలుగు అడుగుల ఎత్తున్న స్వయంభూ శివలింగం కనిపిస్తుంది.. ఆ లింగాన్ని నిరంతరం అభిషేకిస్తున్న పాలరంగులో ఉండే జలధార వెళ్లినవారికి కచ్చితంగా విస్మయానికి గురి చేస్తుంది. ఆ క్షీరధారనే ధూద్‌గంగ అంటారు.

శివుడు ఇక్కడ ఎందుకు ఉన్నాడు ?

భస్మాసురుడి కథ వృత్తాంతం తెలిసే ఉంటుంది. తాను ఎవరి తలపై చేయి పెడితే వారు భస్మం అయ్యేట్టు వరం అనుగ్రహించమంటాడు. శివుడు తథాస్తూ అనేస్తాడు.. శివుడు ఇచ్చిన వరప్రభావాన్ని శివుడిపైనే ప్రయోగించి చూడాలనుకుంటాడు భస్మాసురుడు. శివుడు భస్మాసురుడిని తప్పించుకుని పారిపోతూ ఈ గుహలో దాక్కున్నాడట! మిగతా కథ మనకు తెలిసిందే!

ఈ గుహ నుంచి రెండు సొరంగ మార్గాలున్నాయి. ఒక దారేమో నేరుగా స్వర్గానికి చేరుస్తుంది. అమరలోకానికి చేరుకోవాలన్న కోరికతో కొంతమంది ప్రయత్నించారట! అయితే వారెవ్వరూ వెనక్కి తిరిగి రాలేదట! అందుకే ఎవరూ సాహసం చేయరు. ఇంకో మార్గం కూడా ఉంది. ఆ దారంట నడిచి వెళితే అమర్‌నాథ్‌ ఆలయానికి చేరుకోవచ్చట! కొంతమంది సాధువులు ఈ ప్రయత్నం కూడా చేశారట! ప్రస్తుతం ఈ సొరంగ మార్గాన్ని కూడా మూసివేశారు. ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పున్నమి వరకు జరిగే అమర్‌నాథ్‌లో పూజలందుకునే శివుడు మిగతా సమయంలో ఈ గుహలోనే ఉంటాడన్నది స్థానికుల ప్రగాఢ విశ్వాసం.. అందుకే కాబోలు ఈ క్షేత్రాన్ని బూఢా అమర్‌నాథ్‌ అని కూడా అంటారు.

ఈ క్షేత్రంలో మరో అద్భతం పావురాళ్లు. ఈ చుట్టుపక్కల ఎక్కడా కనిపించని కపోతాలు కేవలం ఈ గుహలోనే దర్శనమివ్వడం అక్కడికి వెళ్లినవారిని ఆశ్యర్యానికి గురిచేస్తుంది.. ఎన్నో ఎళ్ల నుంచి ఈ పావురాళ్ల సంఖ్య అంతే ఉండటం కూడా విశేషమే. అమర్‌నాథ్‌ లాగే ఇక్కడ కూడా రెండు అదృశ్య పావురాళ్లు ఉంటాయట! పుణ్యం చేసినవారికి మాత్రమే అవి దర్శనం ఇస్తాయట! మహాశివరాత్రి సమయంలో మూడు రోజుల పాటు ఉత్సవం జరుగుతుంది. సాహసాలు చేయాలనుకునే వారికి ఈ ప్రదేశం మంచి స్పాట్‌.!

Read more RELATED
Recommended to you

Latest news