ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్‌కు చేరిన హైద‌రాబాద్‌.. ముంబైపై బంప‌ర్ విక్ట‌రీ..!

-

షార్జా వేదిక‌గా మంగ‌ళ‌వారం జ‌రిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 56వ మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్‌పై స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఘ‌న విజ‌యం సాధించింది. ముంబై విసిరిన 150 ప‌రుగుల ల‌క్ష్యాన్ని హైద‌రాబాద్ అల‌వోక‌గా ఛేదించింది. ఈ క్ర‌మంలో ముంబైపై హైద‌రాబాద్ 10 వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

sunrisers hyderabad won by 10 wickets against mumbai indians in ipl 2020 56th match

మ్యాచ్‌లో హైద‌రాబాద్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా.. ముంబై బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులు చేసింది. ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ అంద‌రూ విఫ‌ల‌మ‌య్యారు. చివ‌ర్లో పొల్లార్డ్ మెరుపుల‌తో ముంబై గౌర‌వ ప్ర‌ద‌మైన స్కోరు చేయ‌గ‌లిగింది. మొత్తం 25 బంతులు ఆడిన పొల్లార్డ్ 2 ఫోర్లు, 4 సిక్స‌ర్ల‌తో 41 ప‌రుగులు చేశాడు. 29 బంతుల్లో 5 ఫోర్ల‌తో 36 ప‌రుగులు చేసిన సూర్య కుమార్ యాద‌వ్ ఫ‌ర్వాలేద‌నిపించాడు. మిగిలిన ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. హైద‌రాబాద్ బౌల‌ర్ల‌లో సందీప్ శ‌ర్మ 3 వికెట్లు ప‌డ‌గొట్టాడు. జేస‌న్ హోల్డ‌ర్‌, ఎస్ న‌దీంల‌కు చెరో 2 వికెట్లు ద‌క్కాయి. ర‌షీద్ ఖాన్ 1 వికెట్ తీశాడు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన హైద‌రాబాద్ 17.1 ఓవ‌ర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఛేదించింది. వికెట్ న‌ష్ట‌పోకుండా 151 ప‌రుగులు చేసింది. హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్ల‌లో ఓపెన‌ర్లిద్ద‌రూ అర్ధ సెంచ‌రీలు పూర్తి చేసుకున్నారు. వార్న‌ర్ 58 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో విధ్వంస‌క‌ర ఇన్నింగ్స్ ఆడి 85 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. మ‌రో బ్యాట్స్‌మెన్ సాహా 45 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 58 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. కాగా ఈ విజ‌యంతో హైద‌రాబాద్.. ఐపీఎల్ 2020 ప్లే ఆఫ్స్ కు దూసుకెళ్లింది. ఈ క్ర‌మంలో ఆ జ‌ట్టు ఈ నెల 6వ తేదీన అబుధాబిలో రాయ‌ల్ చాలెంజర్స్ బెంగ‌ళూరుతో ఎలిమినేట‌ర్ మ్యాచ్ ఆడ‌నుంది.

Read more RELATED
Recommended to you

Latest news