సాగర్‌లో అభర్ది జాప్యం వెనుక టీఆర్‌ఎస్‌,బీజేపీ అసలు వ్యూహం అదేనా

-

నాగార్జున సాగర్‌ ఉప ఎన్నిక హోరాహోరీగా సాగనుంది. సిట్టింగ్‌ స్థానంలో అధిక మెజారిటీతో గెలవాలని అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ భావిస్తుంటే..ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని సాగర్‌ ఎన్నికలో గెలుపుతో భర్తీ చేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. దీంతో సాగర్‌లో పోరులో గెలుపుపై ఉత్కంఠ కొనసాగుతోంది. అభ్యర్ధుల ఎంపిక పై కూడా ఈ రెండు పార్టీల వ్యూహప్రతి వ్యూహలు ఆసక్తిరేపుతున్నాయి.

నాగార్జునసాగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. రాజకీయంగా నువ్వా నేనా ? అనే రీతిలో ఇరు పార్టీలు తలపడుతున్నాయి. ప్రచారంతో పాటు అభ్యర్ధి ఎంపికలోనూ అధికార టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఎలాగైనా తమ సిట్టింగ్‌ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు అభ్యర్థి ఎంపికపై ఆచితూచి వ్యవహరిస్తోంది. కాంగ్రెస్‌ అభ్యర్థిగా జానారెడ్డి బరిలో నిలిచారు. 2018 ఎన్నికల్లో జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య విజయం సాధించారు. ఆయన హఠాన్మరణంతో ప్రస్తుతం సాగర్‌ ఖాళీ అయ్యింది. ఈ స్థానాన్ని తిరిగి తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ సాగర్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్ధిని ప్రకటించిన తర్వాత పరిణామాలను బట్టి అభ్యర్ధిని ప్రకటించాలని యోచిస్తోంది బీజేపీ. ఈనెల 30వ తేదీ వరకు నామినేషన్లకు గడువు ఉండడంతో రాజకీయ కారణాలు, సామాజిక కోణాలను పరిగణలోకి తీసుకుని తమ అభ్యర్థిని అదే రోజు ప్రకటించాలని భావిస్తున్నారు టీఆర్‌ఎస్‌ బాస్‌. టీఆర్‌ఎస్‌ నుంచి నోముల నర్సింహయ్య తనయుడితోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన మరో ఇద్దరు నేతలు టికెట్‌ ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డితోపాటు అదే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు నేతలు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఎవరికి టికెట్‌ దక్కుతుందోనని ఉత్కంఠ కొనసాగుతోంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్లకు కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలింది. ఈ శుక్రవారాన్ని మినహాయిస్తే వరుస సెలవుల కారణంగా సోమవారం ఒక్కరోజు మాత్రమే నామినేషన్ వేయడానికి గడువు ఉంది. గడువు ముంచుకు వస్తున్నా అధికార టీఆర్ఎస్ ప్రతిపక్ష బీజేపీలు అభ్యర్థి విషయంలో దోబూచులాడుతున్నాయి. చివరి రోజే అభ్యర్థిని ఖరారు చేసి అప్పటికప్పుడే నామినేషన్ వేయించేలా ప్రణాళికలు సిద్ధం చేశాయి. టీఆర్ఎస్ బీజేపీలో సాగర్ టికెట్ కోసం విపరీతమైన పోటీ ఏర్పడడంతో వ్యూహాత్మకంగా రెండు పార్టీలు అసమ్మతి తగ్గించాలని చివరిరోజు అభ్యర్థిని ఖరారు చేయాలని యోచిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news