ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త బస్సులు..!

-

ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తోంది. రవాణా రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ వినూత్న పద్ధతుల ద్వారా ప్రయాణికులకు చేరువ అవుతోంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.400 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1050 కొత్త డీజిల్ బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. వాటిలో 400 ఎక్స్ ప్రెస్, 512 పల్లె వెలుగులు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. వీటికి తోడు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలను హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెస్తోంది.


ఈ బస్సులన్నీ విడతల వారీగా 2024 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేలా సంస్థ ప్లాన్ చేసింది. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్ వల్ల పెరిగిన రద్దీకి అనుగుణంగా ఈ కొత్త బస్సులను వినియోగించుకోండి.అత్యాధునిక హంగులతో కూడిన 80 కొత్త బస్సులు శనివారం నుంచి వాడకంలోకి వస్తున్నాయి. వీటిలో 30 ఎక్స్ ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్ కమ్ సీటర్ బస్సులున్నాయి. ఈ కొత్త బస్సుల ప్రారంభోత్సవం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద రేపు ఉదయం 10 గంటలకు జరగనుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులకు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version