సంక్షోభ పరిస్థితుల్లో మోదీ వ్యవహరించే తీరు అద్భుతం : జైశంకర్

-

క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రధాని మోదీ ఎల్లప్పుడూ వెంటే ఉంటారని, అది ఆయన గొప్పతనమని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కొనియాడారు. సంక్షోభ పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యవహరించే తీరు చాలా గొప్పగా ఉంటుందని అన్నారు. తనకు తెలియని విషయాలను కూడా అడిగి తెలుసుకుంటారని, అందుకు ఏ మాత్రం సందేహించరని తెలిపారు.

తన నాయకత్వ ప్రతిభతో ఎన్నో సమస్యలను ప్రశాంతంగా పరిష్కరించారని కొనియాడారు. ప్రస్తుతం జైశంకర్‌ అమెరికాలో పర్యటిస్తున్నారు. న్యూయార్క్‌లో ‘మోదీ@20: డ్రీమ్స్‌ మీట్‌ డెలివరీ’ అనే అంశంపై జరిగిన చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొన్నేళ్ల క్రితం అఫ్గానిస్థాన్‌లో భారత రాయబార కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను గుర్తుచేసుకున్నారు.

‘‘2016లో అఫ్గానిస్థాన్‌లోని మజర్‌-ఇ-షరీఫ్‌లో గల భారత దౌత్య కార్యాలయంపై దాడి జరిగింది. అప్పుడు నేను విదేశాంగ శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నా. దాడి విషయం మాకు అర్ధరాత్రి సమయంలో తెలిసింది. దీంతో మేం వెంటనే అక్కడి అధికారులకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించాం. అదే సమయంలో ప్రధానమంత్రి నాకు స్వయంగా ఫోన్‌ చేశారు. అప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్న – ‘మెలకువగానే ఉన్నారా?’ అని. నేను అవునని చెప్పి.. జరిగిన ఘటన నుంచి ప్రధానికి అప్‌డేట్‌ చేశా. భారత్‌ నుంచి అవసరమైన సాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పాను. అప్పుడు మోదీ.. ‘పూర్తయ్యాక నాకు కాల్‌ చేయండి’ అని చెప్పారు. అయితే దానికి రెండు, మూడు గంటలు పడుతుందని, పీఎంవో కార్యాలయానికి ఫోన్‌ చేస్తానని చెప్పాను. దీనికి మోదీ స్పందిస్తూ.. ‘నాకే ఫోన్‌ చేయండి’ అని అన్నారు. ఈ ఒక్క మాట చాలు.. ఆయనలోని అసాధారణ నాయకత్వ లక్షణాన్ని చెప్పడానికి’’ అని జైశంకర్‌ నాటి సంఘటనను పంచుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version