భక్తులకు శుభవార్త.. ఆర్టీసీ కీలక నిర్ణయం

-

ఈ నెల 28న రథసప్తమి సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ప్రముఖ ఆలయాలకు 80 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) తెలిపింది. హైదరాబాద్‌తో సహా జిల్లా కేంద్రాల నుంచి వేములవాడ, ధర్మపురి, యాదగిరిగుట్ట, మన్నెంకొండ, గూడానికి ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపింది. కరీంనగర్‌ నుంచి వేములవాడకు 10, ధర్మపురికి 10, నల్లగొండ నుంచి యాదగిరిగుట్టకు 10, మహబుబ్‌నగర్‌ నుంచి మన్నెంకొండకు 10, ఆదిలాబాద్‌ నుంచి గూడెంకు 5, హైదరాబాద్‌ కేపీహెచ్‌బీ నుంచి అనంతగిరికి 5 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు పేర్కొంది.

అలాగే, హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ పెద్దమ్మ తల్లి, చిలుకూరు బాలాజీ, సికింద్రాబాద్‌ మహంకాళి, హిమాయత్‌నగర్‌ బాలాజీ, తదితర ఆలయాలకు ప్రధాన ప్రాంతాల నుంచి 20 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు తెలిపింది. రథసప్తమి సందర్భంగా ప్రధాన ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని, ప్రయాణికులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, ఎండీ వీసీ సజ్జనార్‌ పేర్కొన్నారు.

భక్తుల రద్దీ మేరకు అవసరమైతే మరిన్నీ బస్సులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రథసప్తమి సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సులను వినియోగించుకోవాలని కోరారు. గురువారం వసంత పంచమి సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరకు, వర్గల్‌కు 108 బస్సులను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news