అల్ల‌రి న‌రేష్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా ఫిక్స్ అయిపోతున్నాడా?

-

అల్ల‌రి న‌రేష్ మొద‌టి నుంచి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప‌లువురు హీరోలతో క‌లిసి న‌టిస్తున్నారు. శ‌ర్వానంద్‌తో క‌లిసి ‘గ‌మ్యం’, ‘నువ్వా నేనా’, ర‌వితేజ‌తో క‌లిసి ‘శంభో శివ శంభో’, మోహ‌న్‌బాబుతో క‌లిసి ‘మామ మంచు అల్లుడు కంచు’, సునీల్‌తో క‌లిసి ‘సెల్లీ ఫెలోస్‌’లో న‌టించిన విష‌యం విదిత‌మే.

అల్ల‌రి న‌రేష్‌.. ‘అల్ల‌రి’ సినిమానే త‌న ఇంటి పేరుగా మార్చుకుని హాస్య‌భ‌రిత చిత్రాల‌కు కేరాఫ్‌గా నిలుస్తున్నారు. కానీ గ‌త మూడు, నాలుగేండ్లుగా ఆయ‌న స‌క్సెస్ అందుకోలేక‌పోతున్నాడు. త‌న తండ్రి, ద‌ర్శ‌కుడు ఈవీవీ స‌త్య‌నారాయ‌ణ మ‌ర‌ణం అనంత‌రం అల్ల‌రి న‌రేష్‌కి బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయ్యింది. ఆ త‌ర్వాత చేసిన ఏ ఒక్క సినిమా అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌లేదు. స‌క్సెస్ కోసం ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌న్నీ విఫ‌ల‌మ‌వుతున్నాయి. ఇటీవ‌ల న‌టించిన ‘సెల్ఫీ రాజా’, ‘మేడ‌మీద అబ్బాయి’, ‘ఇంట్లో దెయ్యం నాకెం భ‌య్యం’, ‘సిల్లీ ఫెలోస్’ ఇలా వ‌రుస‌గా ఫ్లాప్‌ని మూట‌గ‌ట్టుకున్నాయి. రీమేక్ సినిమాలు సైతం అల్ల‌రి న‌రేష్‌ని విజ‌య తీరానికి చేర్చ‌లేక‌పోతున్నాయి.

Will Allari naresh fix as character artist?

ఈ నేప‌థ్యంలో న‌రేష్ రూట్ మార్చారు. క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా మారారు. స్టార్ హీరో సినిమాల్లో కీల‌క పాత్ర‌లో మెరిసేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇప్ప‌టికే తొలి ప్ర‌య‌త్నంగా మ‌హేష్ బాబు న‌టించిన ‘మ‌హ‌ర్షి’ చిత్రంలో ఆయ‌న‌కు స్నేహితుడు ర‌విగా కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఊరు కోసం, రైతుల కోసం పోరాడే పాత్ర‌లో, స్నేహితుడి కోసం త‌న కెరీర్‌ని త్యాగం చేసిన పాత్ర‌లో మెప్పించాడు. ఈ సినిమా న‌రేష్‌కి మంచి పేరుని తెచ్చిపెట్టింది. అయితే ఆ పేరుని న‌రేష్ క్యాష్ చేసుకోలేక‌పోయాడు. నిజం చెప్పాలంటే ఆ పేరు న‌రేష్‌కి ద‌క్క‌కుండా చిత్ర బృందం చేసింద‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ప్ర‌మోష‌న్ విష‌యంలో న‌రేష్‌ని చిన్న‌చూపు చూశారు. ఆ విష‌యాలు కాసేపు ప‌క్క‌న పెడితే న‌రేష్ ఇప్పుడు మ‌రో స్టార్ హీరో సినిమాలో మెర‌వ‌బోతున్నారు.

తాజాగా మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో కలిసి నటించేందుకు నరేష్‌ గ్రీన్‌ సిగ్న‌ల్‌ ఇచ్చారట. ‘డిస్కోరాజా’ సినిమాలో కీలక పాత్రలో మెరవబోతున్నారు. అయితే ఇందులో ఈ పాత్ర కోసం మొద‌ట సునీల్‌ని అనుకున్నప్పటికీ పలు కారణాలతో ఆ స్థానంలో అల్లరి నరేష్‌ని ఫైనల్‌ చేశారట. రవితేజ మార్క్‌ ఎనర్జిటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌కి అల్లరి నరేష్‌ వినోదం తోడైతే అభిమానులకది మంచి వినోదాల విందు అని చెప్పొచ్చు. సైన్స్ ఫిక్ష‌న్ థ్రిల్ల‌ర్ నేప‌థ్యంలో వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో పాయల్‌ రాజ్‌పుత్‌, నభా నటేష్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. గతంలో ర‌వితేజ‌, అల్ల‌రి న‌రేష్ కలిసి ‘శంభో శివ శంభో’ చిత్రంలో న‌టించిన విష‌యం విదిత‌మే. ఇదే సెట్ అయితే వీరికిది రెండో సినిమా అవుతుంది.

ఇదిలా ఉంటే అల్ల‌రి న‌రేష్ మొద‌టి నుంచి అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా ప‌లువురు హీరోలతో క‌లిసి న‌టిస్తున్నారు. శ‌ర్వానంద్‌తో క‌లిసి ‘గ‌మ్యం’, ‘నువ్వా నేనా’, ర‌వితేజ‌తో క‌లిసి ‘శంభో శివ శంభో’, మోహ‌న్‌బాబుతో క‌లిసి ‘మామ మంచు అల్లుడు కంచు’, సునీల్‌తో క‌లిసి ‘సెల్లీ ఫెలోస్‌’లో న‌టించిన విష‌యం విదిత‌మే. మ‌రి ఇప్పుడు చేసే పాత్ర‌లు ఆయ‌న్ని న‌టుడిగా నిల‌బెట్టి, తిరిగి హీరోగా పుంజుకునేలా చేస్తాయా? లేక క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగానే ప‌రిమితం చేస్తాయా? అన్న‌ది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news