సాయుధ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందన్న ధీరుడు సుభాష్‌ బోస్…

-

భారత స్వాతంత్ర్య పోరాటంలో సుభాష్‌ చంద్రబోస్‌ పాత్ర ఒక మైలురాయి. ఓ పక్కన మహాత్మగాంధీ శాంతితోనే జయించాలి అంటూ ఉద్యమాన్ని అహింసా మార్గంతో నడిపిస్తుంటే.. అప్పుడొచ్చాడండీ.. ఇవన్నీ అయ్యే పనులు కాదు.. ఉద్యమం అంటే ఎదురుతిరగాలి, మన గళం గొంతెత్తి బ్రిటీష్‌ పాలకులకు గట్టిగా వినిపించాలని.. తిరుగుబాటు బావుటా ఎగరేసి.. వేలాది మందిని ఉత్తేజింపచేసి.. అజాద్‌ హింద్‌ ఫౌజ్‌ సంస్థకు ప్రాణం పోసిన మహనీయుడు మన సుభాష్‌ చంద్రబోస్. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా ఈ వీరులు చేసిన వీరోచిత ప్రయత్నాలను ఒకసారి నెమరవేసుకుందాం..!
కేవలం అహింసా మార్గంలోనే పనులు జరుగుతాయని వెళ్లితే.. అందుకు ఫలితం రావాలంటే ఏళ్ల సమయం వేచి చూడాలనేది సుభాష్‌ చంద్రబోస్‌ అభిప్రాయం. పోరుబాటే తన రూటన్నాడు సుభాష్ చంద్రబోస్. సాయుధ పోరాటంతోనే దేశానికి స్వాతంత్ర్యం వస్తుందని నమ్మిన ధీరుడు బోస్. స్వాతంత్ర్యం ఒకరు మనకిచ్చేదేమిటి.. మనమే తీసుకోవాలని.. అంగ్లేయులను తరమికోట్టాలని గట్టిగా పిలుపునిచ్చిన వీరుడు సుభాష్‌ బోస్.
1897, జనవరి 23. ఒడిశాలోని కటక్ సిటీలో ఓ సంపన్నకుటుంబంలో పుట్టాడు బోస్. తండ్రి జానకీనాథ్ బోస్…గొప్ప లాయర్. జాతీయవాది కూడా. బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కు కూడా ఎన్నికయ్యారు. చిన్నప్పటి నుంచి తండ్రి అడుగుజాడల్లో నడిచిన బోస్… చదువులోనే కాదు, దేశ భక్తిలో కూడా ఓ అడుగుముందుంటాడు. పుట్టుకతోనే ధనవంతుడు కావడంతో… ఉన్నత చదువులు చదివాడు. 1920లో రాసిన భారతీయ సివిల్ సర్వీసు పరీక్షల్లో ఫోర్త్ ర్యాంక్ సాధించాడు. జాబ్ వచ్చింది.. 1921లో జాబ్‌లో రిజైన్ చేసి… స్వాతంత్ర్య ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్ర పోషించి.. రెండుసార్లు పార్టీ అధ్యక్షుడిగా చేశారు.
గాంధీజీ అహింసావాదం సరిపోదు..
దేశానికి స్వాతంత్ర్యం రావాలంటే.. గాంధీజీ అహింసావాదం మాత్రమే సరిపోదు… పోరుబాట కూడా ముఖ్యమన్నాడు. 1938లో గాంధీ నిర్ణయానికి వ్యతిరేకంగా…. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ప్రత్యర్థి పట్టాభి సీతారామయ్య ఓటమిని తన ఓటమిగా గాంధీ భావించాడని ఓ వాదన అప్పట్లో ఉండేది.. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి.. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పొలిటికల్ పార్టీని స్థాపించాడు. 1939లో సెకండ్ వోల్డ్ వార్ వచ్చింది. ఆంగ్లేయులను దేశం నుంచి తరిమికొట్టేందుకు.. ఇదే సరైన సమయం అని భావించిన బోస్… కూటమి ఏర్పాటు కోసం రష్యా, జర్మనీ, జపాన్ దేశాల్లో విపరీతంగా పర్యటించారు. జపాన్ సహకారంతో ఆజాద్ హిందూ ఫౌజ్‌ను ఏర్పాటు చేశాడు చంద్రబోస్. హిట్లర్‌ను కూడా కలిశారు.
ఆంగ్లేయులను అంతం చేయాటమే అంతిమ లక్ష్యం..
సెకండ్ వోల్డ్ వార్ తర్వాత… బ్రిటీష్ వాళ్లు దేశానికి వదిలి వెళ్తారని గాంధీ, నెహ్రూ లాంటి నాయకులు భావించారు. కానీ చంద్రబోస్ మాత్రం… ఈ యుద్ధంలో ఆంగ్లేయులను అంతంచేయాలని చూశాడు. బ్రిటీష్ సర్కార్ ఏకపక్షంగా, కాంగ్రెస్‌ను సంప్రదించకుండానే ఇండియా తరఫున యుద్ధాన్ని ప్రకటించింది.. దీంతో నిరసనకు దిగిన బోస్.. అండ్ టీమ్‌ను జైల్లో పెట్టించారు. ఏడు రోజుల నిరాహార దీక్ష తర్వాత.. బయటికొచ్చిన బోస్‌ను హౌజ్ అరెస్ట్ చేశారు. మారువేషంలో మేనల్లుడి సహాయంతో దొంగ పాస్ పోర్ట్‌తో పెషావర్ చేరుకున్నాడు. అటు నుంచి జర్మనీ చేరుకుని అక్కడ ఆజాద్ హింద్ రేడియోను స్థాపించి.. ప్రసారాలు మొదలుపెట్టాడు. 42 వరకు జర్మనీలో ఉన్న బోస్… 1943లో భారత సైన్యంలోకి వచ్చాడు. 1944 జులై 4న బర్మాలో జరిగిన ర్యాలీలో బోస్ ఇచ్చిన స్పీచ్ దేశ యువతలో ఉద్యమ స్పూర్తిని నింపింది..మరుగుతన్న రక్తాన్ని మీ ధారపోయండి.. మీకు స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెడతాను అన్నాడు సుబాష్ చంద్రబోస్.
మిస్టరీగా మిగిలిపోయిన మరణం..
పుట్టుక గురించే తప్ప బోస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే. 1945 ఆగస్టు 18న తైవాన్ మీదుగా టోక్యో ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారనేది కథనం. దీని పైనా భిన్నమైన వాదనలున్నాయి. అసలు ఆ రోజు ఎలాంటి విమాన ప్రమాదమూ జరగలేదని.. ఆయన గుమ్నానీ బాబాగా చాలా ఏళ్ల పాటు బతికే ఉన్నారని మరో ప్రచారం కూడా ఉండేది.. గతేడాది బోస్ పుట్టిన రోజు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వంద సీక్రెట్ ఫైళ్లను బయటపెట్టినా… వాటిలో కూడా బోస్ మరణంపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయింది. తర్వాత కూడా బోస్ సీక్రెట్ ఫైళ్లు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అంతకు కొన్ని నెలల ముందే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా కొన్ని ఫైళ్లను డీ క్లాసిఫై చేసింది. అయినా.. ఇప్పటి వరకు బోస్ మరణంపై అనుమానాలు మాత్రం అలానే ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news