గుడ్లవల్లేరు ఘటనపై స్పందించిన వైసీపీ

-

కృష్ణాజిల్లాలోని ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీల్లో ఒకటైన గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ బాత్రూంలో రహస్య కెమెరా బయటపడడంతో విద్యార్థినులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసిన ఇలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ విద్యార్థులు ఆందోళన చేపడుతున్నారు. ఈ ఘటనపై తాజాగా వైసీపీ స్పందించింది.

వైసిపి అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ ఈ ఘటనపై స్పందిస్తూ.. గుడ్లవల్లేరు గర్ల్స్‌ హాస్టల్‌లో హిడెన్‌ కెమెరా అత్యంత దారుణం అన్నారు. ఈ ఘటన వల్ల విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నట్లు చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యావ్యవస్థ సర్వ నాశనమైందని మండిపడ్డారు శివశంకర్. వెంటనే దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం అని ఫైర్ అయ్యారు.

వారం రోజులుగా ఈ వ్యవహారం కొనసాగుతున్నా.. దీనిపై విద్యార్థినిలు ఫిర్యాదు చేసినా.. కళాశాల యాజమాన్యం ఎందుకు తొక్కిపెట్టిందో చెప్పాలని డిమాండ్ చేశారు. విషయం తెలియగానే పోలీసులకు ఎందుకు చెప్పలేదని..? ఒకవేళ చెప్పినా వారు స్పందించలేదా..? అని ప్రశ్నించారు. విద్యార్థినిల హాస్టల్‌లో కనీస సెక్యూరిటీ లేకపోతే ఎలా..? అని నిలదీశారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు అయిన విజయ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో జనసేన పోస్టర్‌లు ఉన్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version