ఎడిట్ నోట్: కోమటిరెడ్డి ‘కీ’ రోల్!

-

తెలంగాణలో అసలు సిసలు రాజకీయం ఇప్పుడు మొదలు కానుంది…సాధారణ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ…కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహారం తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయి.  ఇప్పటివరకు రాజకీయం ఒక ఎత్తు…ఇక నుంచి మరొక ఎత్తు అన్నట్లు…తెలంగాణ రాజకీయాలు నడవనున్నాయి. మునుగోడు ఉపఎన్నిక ద్వారా…రాబోయే రోజుల్లో ప్రజలు ఏ పార్టీకి పట్టం కడతారో క్లారిటీ వచ్చేస్తుంది.

ఇప్పటివరకు కొన్ని ఉపఎన్నికలు జరిగాయి..వివిధ పరిస్తితుల నేపథ్యంలో ఉపఎన్నికల్లో గెలుపోటములు వచ్చాయి. కానీ అధికారంలో ఉన్న టీఆర్ఎస్ కు చెక్ పెట్టి బీజేపీ రెండు ఎన్నికల్లో గెలవడం అనేది మామూలు విషయం కాదు…ఆ ఉపఎన్నికల ద్వారా తెలంగాణలో బీజేపీ బలపడుతుందనే విషయం అర్ధమైంది. కానీ మునుగోడు ఉపఎన్నిక మరో ఎత్తుకు తీసుకెళ్లనుంది. ఓ రకంగా చెప్పాలంటే మునుగోడు ఉపఎన్నిక ఒక సెమీఫైనల్ లాంటిది అని చెప్పొచ్చు…ఆ  ఎన్నికలో ఎవరు గెలిస్తే…వారికి ప్రజల మద్ధతు కాస్త ఎక్కువగా ఉంటుందనే చెప్పొచ్చు. రానున్న ఎన్నికల్లో ప్రజా మద్ధతు ఎవరికి ఉందో మునుగోడు ఉపఎన్నిక చెప్పేయనుంది.

అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కీ రోల్ పోషిస్తున్నారని చెప్పొచ్చు. రాష్ట్రంలో రాజకీయం పోటాపోటిగా నడుస్తున్న తరుణంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి…రాజకీయాన్ని మరింత వేడెక్కించారు. వాస్తవానికి ఈయన ఎప్పటినుంచో కాంగ్రెస్ ని వదిలి…బీజేపీలోకి రావాలని చూస్తున్న విషయం తెలిసిందే…కానీ బీజేపీ అధిష్టానం సరైన సమయం చూసుకుని కోమటిరెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని చూసింది.

ఇక ఆ సమయం ఇప్పుడు వచ్చిందనే చెప్పాలి…అందుకే బీజేపీ అనూహ్యంగా కోమటిరెడ్డిని రంగంలోకి దింపింది. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించింది. ఇలా చేస్తే మునుగోడు ఉపఎన్నిక వస్తుంది..ఆ ఉపఎన్నికలో ఒకేసారి టీఆర్ఎస్, కాంగ్రెస్ లకు చెక్ పెట్టి తమ సత్తా ఏంటో చూపించాలని బీజేపీ భావిస్తుంది. ఈ ఉపఎన్నికలో గెలిస్తే ఇంకా నెక్స్ట్ ఎన్నికల్లో తమకు తిరుగుండదని బీజేపీ భావిస్తుంది. అందుకే ఇప్పుడు కోమటిరెడ్డి చేత కీ రోల్ పోషించేలా చేసింది.

అయితే రేవంత్ రెడ్డి నాయకత్వం నచ్చకే తాను పార్టీకి దూరమయ్యనని కోమటిరెడ్డి చెబుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఒకటి రెండు రోజుల్లో స్పీకర్‌ను కలసి తన రాజీనామా పత్రాన్ని అందజేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడిందని, ఏ పార్టీ కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడుతుందో ఆ పార్టీలో ఉంటానన్నారు. భారతదేశం ప్రధాని మోదీ నాయకత్వంలో దూసుకుపోతోందని.. కేంద్రంలో మూడోసారి కూడా బీజేపీనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, ఈ రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ అరాచక పాలన పోవాలంటే.. అది మోదీ అమిత్‌ షా వల్లే సాధ్యమని కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు.

అయితే కోమటిరెడ్డి స్వార్ధం కోసమే పార్టీ మారుతున్నారని, ఓ వైపు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియాని మోదీ, అమిత్ షాలు ఇబ్బంది పెడుతుంటే…అలాంటి వారి చెంతకు చేరి రాజగోపాల్ కాంగ్రెస్ శ్రేణులకు తీరని ద్రోహం చేశారని టి‌పి‌సి‌సి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఇక ఏదేమైనా ఉపఎన్నికలోనే తేల్చుకుంటామని చెబుతున్నారు. అటు టీఆర్ఎస్ సైతం ఉపఎన్నికలో గెలవడానికి అప్పుడే మునుగోడుకు నిధుల వరద పారించడం మొదలుపెట్టింది.

మొత్తానికి తెలంగాణ రాజకీయాలని కోమటిరెడ్డి..కీలక మలుపు తిప్పారు. ఇక నుంచి తెలంగాణలో పోలిటికల్ గేమ్ ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news