చేతకాక కాదు..తెలంగాణ దుర్మార్గంపై ఎంత వరకైనా వెళ్తాం : ఏపీ మంత్రి వార్నింగ్

-

ఏపీ-తెలంగాణల మధ్య జల వివాదం చిలికి చిలికి గాలి వాన అయింది. జల వివాదం నేపథ్యంలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని.. ఏపీ కేటాయించిన నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేస్తోన్నా తెలంగాణ అభ్యంతరం చెబుతోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి చేత కాక కాదు.. గట్టిగానే రియాక్ట్ అవుతామని..తెలంగాణ దుర్మార్గంపై ఎంత వరకైనా వెళ్తామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ వ్యవహర శైలి కొంత కాలంగా చూస్తున్నామని.. ఏపీకి కేటాయింపులకు లోబడే ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

శ్రీశైలం ప్రాజెక్టులో 844 అడుగులు పైకి ఉంటేనే పోతిరెడ్డిపాడు ద్వారా నీటి తరలింపు సాధ్యమని.. తెలంగాణ 800 అడుగులకే నీటిని డ్రా చేస్తోందన్నారు. ఈ విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండకూడదనే రీతిలో తెలంగాణ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని… జీవో జారీ చేసి మరీ జల విద్యుత్ ఉత్పత్తి పూర్తి సామర్ధ్యంతో పని చేయాలని తెలంగాణ ఆదేశాలు జారీ చేయడం సరి కాదన్నారు.

ఏపీ, తెలంగాణ ప్రాజెక్టులను కేఆర్ఎంబీ పరిధిలోకి తేవాలని సీఎం జగన్ ఎప్పుడో చెప్పారని.. తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమ ప్రాజెక్టులు కడుతోందని ఆరోపణలు చేశారు. దీనిపై కేఆర్ఎంబీకి.. ప్రధానికీ లేఖ రాస్తామన్నారు. తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో విడుదల చేసిన నీటి మొత్తాన్ని వారి కేటాయింపుల నుంచి మినహాయించాలని కోరతామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version